ఏడు కేసులు నమోదు
ఐపీసీ 498ఏ, 323, 307, 376, 506, 328, 34 సెక్షన్ల కింద షమీపై ఏడు కేసులు నమోదయ్యాయి. తాజాగా షమీ భార్య మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో విషయంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) సాయం తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని శుక్రవారం ఓ జాతీయ న్యూస్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్యూలో వెల్లడించింది.
బీసీసీఐతో సంప్రదింపులు
‘ప్రస్తుతం మా న్యాయవాది బీసీసీఐతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ వ్యవహారం ఇక్కడితో తేలకపోతే రేపు భవిష్యత్తులో మరికొందరు ఆటగాళ్లు కూడా ఇలాగే చేసే అవకాశం కల్పించినట్లు అవుతుంది. ఒకవేళ ఇది బోర్డు పరిధిలోనే జరిగి ఉంటే మాత్రం వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది' అని ఆమె పేర్కొంది.
డిటెక్టివ్ విభాగం తన చేతుల్లోకి షమీ కేసు
అయితే బీసీసీఐనే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ వ్యవహారానికి ముగింపు పలికే విధంగా ప్రయత్నాలు ప్రారంభించిందని.. ఈ మేరకు జహాన్కు రాజీ ప్రతిపాదన పంపిందన్న మరో కథనం జాతీయ మీడియాలో వస్తోంది. మరోవైపు ఈ కేసును లాల్ బజార్ పోలీస్ స్టేషన్కు చెందిన డిటెక్టివ్ విభాగం తన చేతుల్లోకి తీసుకుంది.
గత రెండు రోజులుగా షమీపై జహాన్ తీవ్ర ఆరోపణలు
షమీ కేసును విమెన్స్ గ్రీవెన్స్ సెల్ ఆధ్వర్యంలో దర్యాప్తు జరపనున్నట్టు కోల్కతా పోలీసులు తెలిపారు. 2012లో కోల్కతా నైట్ రైడర్స్ పార్టీలో జహాన్-షమీలు కలుసుకున్నారు. ఆ తర్వాత ప్రేమలో పడిన వీరు ఏప్రిల్ 7, 2014లో వివాహం చేసుకున్నారు. వీరికి రెండున్నరేళ్ల పాప ఉంది. కాగా, గత రెండు రోజులుగా షమీపై జహాన్ తీవ్ర ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే.