హైదరాబాద్: బంగ్లాదేశ్ క్రికెటర్ అరాఫత్ సన్నీ మరోసారి జైలుకు వెళ్లాలే కనిపిస్తున్నాడు. అదనపు కట్నం తేవాలని తన భార్యను వేధిస్తుండటంతో అతడిపై ఢాకాలోని సైబర్ ట్రిబ్యునల్ (బంగ్లాదేశ్)లో ఐసీటీ యాక్ట్ కింద కేసు నమోదైంది.
వివరాల్లోకి వెళితే... 2014 డిసెంబర్ 4న నస్రీన్ సుల్తానాతో అరాఫత్ సన్నీకి వివాహమైంది. అప్పట్లో అతడు బంగ్లాదేశ్ కరెన్సీలో 5.1 లక్షలు కట్నంగా తీసుకున్నాడు. వివాహ అనంతరం కాటాసుర్ ప్రాంతంలోని మొహమ్మద్ పూర్లో నస్రీన్ చెల్లెలు ఇంటికి సమీపంలోనే నివసించేవారు.

అయితే, ఆ తర్వాత కొన్నాళ్లకు తన భార్యను 20 లక్షల కట్నం తేవాలని సన్నీ, అతడి తల్లి వేధించడం మొదలుపెట్టారు. అయితే ఇందుకు ఆమె అంగీకరించలేదు. సన్నీ వేధింపులు భరించలేని నస్రీన్ ఈ ఏడాది జనవరి 5న మొహమ్మద్ పూర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది.
కేసు నమోదు చేసుకున్న సన్నీని 22న పోలీసులు అరెస్టు చేశారు. ఈ కట్నం వివాదం పరిష్కరించుకున్నారని తెలియడంతో మార్చిలో అతడిని బెయిల్పై విడుదల చేశారు. మళ్లీ అతడిని జులై 16న అరెస్టు చేశారు. అయితే జైలులో చికున్ గన్యా రావడంతో బెయిల్పై విడుదలయ్యాడు. తాజాగా మళ్లీ సన్నీ భార్య పోలీసులను ఆశ్రయించడంతో అక్టోబర్ 12న పోలీసులు కేసు రీ ఓపెన్ చేశారు.