స్వాగతించిన భారత ఒలింపిక్ సంఘం
క్రికెట్ను తిరిగి తీసుకురావాలని ఓసీఏ తీసుకున్న నిర్ణయాన్ని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) స్వాగతించింది. అయితే ఏ ఫార్మాట్ను ఇందులో కొనసాగిస్తారన్న దానిపై స్పష్టత లేదని ఐవోఏ సెక్రటరీ జనరల్ రాజీవ్ మోహతా చెప్పారు. 2022 ఆసియా క్రీడలకు ఇంకా సమయం ఉంది కాబట్టే క్రికెట్లో భారత్ ప్రాతినిథ్యం వహించే విషయం గురించి చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ తెలిపింది.
బీసీసీఐ ప్రతినిధి ఇలా
‘‘వచ్చే ఆసియా క్రీడలకు ఇంకా చాలా సమయం ఉంది. అప్పటిలోపు క్రికెట్లో భారత్ పోటీపడుతుందో లేదో అనే విషయంపై చర్చించి.. ఓ నిర్ణయం తీసుకుంటాం'' అని బీసీసీఐ ప్రతినిధి తెలిపాడు. 2010 క్రీడల క్రికెట్లో శ్రీలంక, పాకిస్థాన్ వరుసగా పురుషుల, మహిళల విజేతలుగా నిలిచాయి. 2014లో పురుషుల విభాగంలో బంగ్లాదేశ్, మహిళల విభాగంలో పాకిస్థాన్ స్వర్ణాలు సొంతం చేసుకున్నాయి.
ఆసియా ఒలింపిక్ చీఫ్గా షేక్ అహ్మద్
ప్రస్తుత అధ్యక్షుడు షేక్ అహ్మద్ అల్ ఫహాద్ అల్ సబాకే మళ్లీ ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ (ఓసీఏ) పగ్గాలు దక్కాయి. ఆదివారం జరిగిన కమిటీ జనరల్ అసెంబ్లీలో కువైట్కు చెందిన షేక్ అహ్మద్ మరో ఐదేళ్ల కాలానికి ఓసీఏ చీఫ్గా ఎన్నికయ్యారు. ఓ ఫోర్జరీ కేసుకు సంబంధించి విచారణ ఎదుర్కొంటున్న 55 ఏళ్ల షేక్ గతేడాది నవంబరులో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యుని పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.