|
విరాట్ కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్..
ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్లో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ చేశాడంటూ ఆరోపణలు రావడం తీవ్ర దుమారం రేపింది. విరాట్ కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ చేసినందుకు ఐసీసీ నిబంధనల ప్రకారం.. తమ జట్టు ఖాతాలో ఐదు పరుగులు జత చేస్తే.. తాము గెలిచేవాళ్లమని బంగ్లా వికెట్ కీపర్ నురుల్ హసన్ ఆరోపించాడు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ సందర్భంగా.. అక్షర్ పటేల్ వేసిన ఇన్నింగ్స్ 6.2వ ఓవర్లో బంతిని డీప్ దిశగా గ్యాప్లోకి బాదిన లిట్టన్ దాస్ రెండు పరుగులు తీశాడు.
రెండో పరుగు తీస్తున్న సమయంలో ఫీల్డర్ అర్షదీప్ వికెట్ కీపర్కు బంతిని విసరగా.. మధ్యలో ఉన్న విరాట్ కోహ్లీ బంతిని నాన్స్ట్రయికర్ ఎండ్కు విసిరినట్లుగా చేశాడు. ఈ వీడియోను వైరల్ చేసిన బంగ్లా ఫ్యాన్స్ కోహ్లి ఫేక్ ఫీల్డింగ్ చేశాడని ఆరోపిస్తున్నారు. ఐసీసీ నిబంధనల ప్రకారం బ్యాట్స్మెన్ ఏకాగ్రతకు భంగం కలిగించినా.. మోసపూరితంగా వ్యవహరించినా.. బ్యాటర్కు ఆటంకం కలిగించినా ఐదు పరుగులు పెనాల్టీగా ఇవ్వాలని.. కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ చేశాడు కాబట్టి.. ఆ నిబంధన వర్తిస్తుందని బంగ్లా ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. అయితే కోహ్లీ చర్య వల్ల బ్యాటర్ల ఎకాగ్రత దెబ్బతినలేదు. దాంతో అంపైర్లు పెనాల్టీ విధించలేదు.
దనుష్క గుణతిలకపై లైంగిక వేధింపుల కేసు
టీ20 ప్రపంచకప్ సందర్భంగా ఆసీస్ వచ్చిన శ్రీలంక ప్లేయర్ దనుష్క గుణతిలక వివాదాల్లో చిక్కుకున్నాడు. ఓ అమ్మాయిపై అతను అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆస్ట్రేలియా పోలీసులు శ్రీలంక ఆటగాడిని అరెస్టు చేశారు. శ్రీలంక జట్టు ప్రపంచకప్ నుంచి నిరాశతో వెనుదిరిగినా గుణతిలక జట్టుతో కలిసి వెళ్లలేదు. 11 రోజుల పాటు జైలులో కూడా గడిపాడు. కోర్టు బెయిల్ అందించినా శ్రీలంక క్రికెట్ బోర్డు అతనిపై నిషేధం విధించింది.
|
దీప్తి శర్మ రనౌట్..
భారత మహిళల జట్టు సెప్టెంబర్లో ఇంగ్లండ్లో పర్యటించింది. ఈ టూర్లోని మూడు వన్డేల సిరీస్లో చివరి మ్యాచ్లో, భారత జట్టు స్పిన్నర్ దీప్తి శర్మ చేసిన పనికి క్రికెట్ ప్రపంచం మొత్తం రెండు ముక్కలైంది. ఈ మ్యాచ్లో దీప్తి నాన్-స్ట్రైకర్ ఎండ్లో ఇంగ్లండ్ బ్యాటర్ షార్లెట్ డీన్ను మన్కడ్ రనౌట్ చేసింది. దీంతో పలువురు ఇంగ్లిష్ క్రికెటర్లు దీప్తిని విమర్శిస్తూ ట్విటర్లో పోస్టులు షేర్ చేశారు. దీప్తి క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు టీమిండియా క్రికెటర్లు, పలువురు మాజీ ఆటగాళ్లు ఇందులో తప్పేమీ లేదంటూ మహిళా క్రికెటర్కు అండగా నిలిచారు.
విరాట్ కోహ్లీ గది వీడియో వైరల్..
ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లిన భారత జట్టుకు కనీస భద్రత కరువైంది. విరాట్ కోహ్లీ గదికి సంబంధించిన వీడియో వైరల్గా మారడం వివాదాస్పదమైంది. ఆ సమయంలో పెర్త్లో ఉన్న టీమిండియా క్రౌన్ హోటల్లో బస చేసింది. కోహ్లీ తన గదిలో లేని సమయంలో అతడి గదిలోకి ప్రవేశించిన ఓ వ్యక్తి అతడిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో బయటకు రావడంతో కోహ్లీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనిపై పలువురు క్రికెటర్లు కూడా విమర్శలు గుప్పించారు. దీంతో హోటల్ యాజమాన్యం చర్యలు తీసుకుని వీడియో తీసిన వ్యక్తిని ఉద్యోగంలో నుంచి తొలగించింది.
రాజస్థాన్ X ఢిల్లీ నోబాల్ వివాదం..
ఐపీఎల్ 2022 సీజన్ సందర్భంగా అంపైర్ల తీరుపై ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ నిరసన వ్యక్తం చేయడం తీవ్ర దుమారం రేపింది. నోబాల్ ఇవ్వలేదని, బ్యాటర్లను మైదానం వదిలి రమ్మనడం చర్చనీయాంశమైంది. 223 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్లకు 187 పరుగులు చేసింది. చివరి ఓవర్లో ఢిల్లీ విజయానికి 36 పరుగులు అవసరమవ్వగా.. రావ్ మాన్ పావెల్.. మెకాయ్ బౌలింగ్లో వరుసగా మూడు సిక్స్లు బాదాడు. దాంతో విజయ సమీకరణం 3 బంతులకు 18 పరుగులుగా మారింది.
అయితే ఆ ఓవర్ మూడో బంతిని మెకాయ్ హై ఫుల్ టాస్ వేశాడు. దాదాపు అది నడుము కంటే ఎక్కువ ఎత్తులో ఉంది. దాంతో దాన్ని నో బాల్ గా ప్రకటించాలని మైదానంలో ఉన్న కుల్దీప్ యాదవ్, పావెల్ అంపైర్లను కోరగా.. వారు నిరాకరించారు. దాంతో ఆగ్రహానికి గురైన పంత్, ఢిల్లీ సహాయక కోచ్ ఆమ్రే, శార్దూల్ ఠాకూర్ వాగ్వాదానికి దిగారు. బ్యాటర్లను వెనక్కి వచ్చేయాలని పిలిచారు. అప్పట్లో ఇది తీవ్ర దుమారం రేపింది.