సిడ్నీ: మూడో టెస్ట్లో భారత క్రికెటర్లపై జాతివివక్ష వ్యాఖ్యలు చేసిన అభిమానులను క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) కనిపెట్టలేకపోయింది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)కి సమర్పించిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. స్టాండ్స్ నుంచి బయటకు పంపిన ఆరుగురు వ్యక్తులు నిజమైన దోషులు కారని సీఏ నివేదికలో పేర్కొంది. ఆ ఆరుగుర్ని విచారించిన సీఏ అధికారులు.. అసలు దోషులను గుర్తించడంలో విఫలమయ్యారని లోకల్ మీడియాలో కథనాలు వచ్చాయి.
'న్యూసౌత్ వేల్స్ పోలీసులు ఇచ్చే ఫైనల్ రిపోర్ట్ కోసం సీఏ ఎదురు చూస్తోంది. లోయర్ టైయర్లో ఉన్న ఆరుగుర్ని పోలీసులు బయటకు పంపారు. కానీ విచారణలో వాళ్లు దోషులు కాదని తేలింది. వాళ్లపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. అసలు సిరాజ్పై జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన వారిని గుర్తించేందుకు పోలీసులు ఇంకా పని చేస్తున్నారు.'అని ఓ స్థానిక పేపర్ ప్రచురించింది.
క్రికెటర్లు జాతి వివక్ష వ్యాఖ్యలకు గురయ్యారని భావిస్తున్నప్పుడు విచారణాధికారులు మాత్రం దోషులను ఎందుకు గుర్తించలేకపోతున్నారని ప్రశ్నించింది. ఆసీస్తో జరిగిన మూడో టెస్ట్ నాలుగో రోజు ఆటలో సిరాజ్పై జాతి వివక్ష వ్యాఖ్యలు చేయగా.. భారత్ దీనిపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై యావత్ క్రికెట్ ప్రపంచం స్పందించింది. ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.