కోల్కతా నుంచి దక్షిణాఫ్రికాకు:
దక్షిణాఫ్రికా జట్టు మంగళవారం కోల్కతా నుంచి స్వదేశానికి తిరుగు ప్రయాణమవుతుందని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అభిషేక్ దాల్మియా తెలిపారు. 'ప్రొటీస్ ఆటగాళ్లు సోమవారం కోల్కతాకు చేరుకుని మరుసటి రోజు దుబాయ్ మీదుగా దక్షిణాఫ్రికా వెళతారు. వీరిని క్షేమంగా పంపేందుకు బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ప్రధాన కార్యదర్శికి కూడా ఈ విషయాన్ని తెలిపాం' అని దాల్మియా పేర్కొన్నారు.
సఫారీ ఆటగాళ్లకు విశ్రాంతి:
కరోనా కారణంగా వన్డే సిరీస్ రద్దు కావడంతో సఫారీ ఆటగాళ్లు లఖ్నవ్ నుంచి ముంబై లేక ఢిల్లీకి రావడానికి కూడా భయపడ్డారు. అందుకే ప్రస్తుతానికి ఎలాంటి వైరస్ కేసులు నమోదు కాని కోల్కతాకు చేరుకున్నారు. అక్కడి నుంచి దుబాయ్ మీదుగా దక్షిణాఫ్రికాకు వెళ్లాలనేది సఫారీల ఆలోచన. సిరీస్ వాయిదా పడ్డాక సఫారీ ఆటగాళ్లకు విశ్రాంతి లభించింది. ఆదివారం వాలీబాల్ ఆడుతూ కనిపించారు. క్రికెట్ దక్షిణాఫ్రికా బోర్డు ఆ వీడియోను ట్విటర్లో పోస్టు చేసింది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం:
షెడ్యూల్ ప్రకారం.. మార్చి 12 నుంచి 18 వరకు భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరగాల్సి ఉంది. 12న ధర్మశాలలో జరగాల్సిన తొలి వన్డే టాస్ కూడా పడకుండా వర్షం వల్ల రద్దైన విషయం తెలిసిందే. ఇక కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అదే రోజు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. క్రీడా పోటీలు వీక్షించేందుకు మైదానంలోకి ప్రేక్షకులను అనుమతించరాదని దేశంలోని అన్ని క్రీడల సమాఖ్యలకు ఆదేశాలు జారీ చేసింది.
సిరీస్ రద్దు:
కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో లఖ్నవూలో జరగాల్సిన రెండో వన్డే, కోల్కతాలో జరగాల్సిన మూడో వన్డేను ప్రేక్షకులు లేకుండా నిర్వహిస్తారనే వార్తలు వచ్చాయి. కానీ.. కరోనా పంజా విసురుతుండడంతో బీసీసీఐ ఏకంగా సిరీస్నే రద్దు చేసింది. శుక్రవారమే అందుబాటులో ఉన్న విమానాన్ని పట్టుకుని సఫారీలు వెళుతారని తెలిసింది. కానీ కరోనా ప్రభావంతో అక్కడే ఉండిపోయింది. అప్పటి నుంచి దక్షిణాఫ్రికా జట్టు లఖ్నవూలోనే గడిపింది.
కరోనా ప్రభావం తగ్గాక సిరీస్:
కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టిన తర్వాత మళ్లీ భారత్-దక్షిణాఫ్రికా సిరీస్ను నిర్వహిస్తామని బీసీసీఐ పేర్కొంది. అందుకు క్రికెట్ దక్షిణాఫ్రికా సైతం ఒప్పుకొందని సమాచారం తెలుస్తోంది. వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా.. జనాలు గుమిగూడటం మంచిది కాదని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేయడంతో వేసవి క్రికెట్ పండుగ ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వారాలు ముందుకు జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో.. ప్రేక్షకులతో కళకళలాడాల్సిన మైదానాలు ఖాళీ కుర్చీలతో వెలవెలబోతున్నాయి.