|
హోరెత్తిన సోషల్ మీడియా:
ఐపీఎల్ 14 సీజన్ నిరవధికంగా వాయిదా పడటంతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. కొందరు ఐపీఎల్ 2021 వాయిదాను సమర్థిస్తుంటే.. మరికొంతమంది మాత్రం మజాను మిస్సయ్యామని ఫీలవుతున్నారు. టోర్నీ ఇలా మధ్యలో ఆగిపోవడంతో తమ జట్లు టైటిల్ గెలిచే చాన్స్ను కోల్పోయామని మీమ్స్ ద్వారా మరికొందరు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఎవరికి తోచింది వారు పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ అభిమాని దక్షిణాఫ్రికా వెటరన్ పేసర్ డేల్ స్టైయిన్ను ట్యాగ్ చేసి మరీ ప్రశ్నలు సంధించాడు. ఐపీఎల్ 2020లో బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించిన స్టైయిన్.. ఈఏడాది మాత్రం దూరంగా ఉన్నాడు. అయితే 2021 పీఎస్ఎల్లో మాత్రం పాల్గొన్నాడు.
కరోనా ఎవరినీ లెక్కచేయదు:
2020 మార్చి నెలలో కరోనా కారణంగా పీఎస్ఎల్ ఆగిపోవడంతో.. ఐపీఎల్ 2020 సీజన్ను కోడ్ చేస్తూ ఒక అభిమాని ట్వీట్ చేశాడు. 'డేల్ స్టెయిన్ ఇప్పుడు చెప్పు పీఎస్ఎల్, ఐపీఎల్లో ఏది ఉత్తమం. ఏ టోర్నీని సమర్ధవంతంగా నిర్వహించారో వాస్తవం తెలుసుకో. అందుకు తగినంత సమయం కూడా ఉంది' అని మార్చి 4వ తేదీన ట్వీట్ చేశాడు. అప్పుడు కేవలం 'నువ్వు చాలా సరదా మనిషివి' అంటూ స్పందించిన స్టెయిన్.. తాజాగా ఐపీఎల్ 2021 వాయిదా పడిన తర్వాత ఓ సెటైర్ వేశాడు. 'కరోనా ఎవరినీ లెక్కచేయదు. దానికి ఇష్టమైన వ్యక్తులు అంటూ ఎవరూ ఉండరు. కరోనా సోకినా అందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా' అని ట్వీట్ చేశాడు. సెటైర్ రూపంలో రిప్లై ఇచ్చిన స్టెయిన్కు మరొసారి ట్రోలింగ్ బారిన పడే అవకాశం ఉంది.
ఐపీఎల్లో డబ్బుకు మాత్రమే ప్రాధాన్యత:
ఐపీఎల్లో డబ్బుకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారని, అసలు ఆటకు విలువ లేదని గతంలో డేల్ స్టెయిన్ అన్నాడు. ఐపీఎల్ కంటే పీఎస్ఎల్, శ్రీలంక ప్రిమియర్ లీగ్ (ఎల్పీఎల్)లో ఆటగాడిగా ఎక్కువ గుర్తింపు లభిస్తుందని చెప్పుకొచ్చాడు. స్టెయిన్ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో తనపై వస్తున్న విమర్శలపై దక్షిణాఫ్రికా పేసర్ స్పందించాడు. 'నా వ్యాఖ్యలతో ఎప్పుడూ ఏ లీగ్లను కించపరచడం, అవమానించడం లేదా పోల్చడం చేయలేదు. నా వ్యాఖ్యలను సోషల్ మీడియా తప్పుగా రాసుకొచ్చింది. ఐపీఎల్ను చులకన చేసి మాట్లాడి ఉంటే క్షమించండి' అని అన్నాడు.
సరైన నిర్ణయమే:
ఐపీఎల్ చాలా గొప్ప ఈవెంట్. ఈ సీజన్ వాయిదా పడటం అనేది గత రెండు మూడు రోజుల పరిస్థితుల ఆధారంగా తప్పనిసరిగా మారింది. ఈ క్రికెట్ సమరం మళ్లీ సంతోషకరమైన పరిస్థితుల్లో జరగాలని ఆశిస్తున్నా' అని హర్షా భోగ్లే ట్వీట్ చేశారు. 'భారత దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలువురు ఆటగాళ్లు కూడా వైరస్ బారిన పడుతున్నారు. ఈ సందర్భంగా బీసీసీఐ, ఐపీఎల్ పాలక మండలి ఉన్నపళంగా ఈ టోర్నీని వాయిదా వేయడం సరైన నిర్ణయం. త్వరలోనే ఆరోగ్యకరమైన వాతావరణంలో మళ్లీ ఐపీఎల్ జరగాలని కోరుకుంటున్నా' అని మొహ్మద్ అజహరుద్దీన్ అన్నారు.