హైదరాబాద్: ఐపీఎల్ 2018 సీజన్ ప్రారంభానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఏడాది జనవరిలో బెంగళూరు వేదికగా జరిగిన వేలంలో ఆర్సీబీ దక్కించుకున్న ఆస్ట్రేలియా పేసర్ నాథన్ కౌల్టర్ నైల్ గాయం కారణంగా ఐపీఎల్ 11వ సీజన్ నుంచి తప్పుకున్నాడు.
నెల జీతం సరిపోవడం లేదు: చిన్నారి కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన
అతడు తీవ్రమైన గాయంతో బాధపడుతున్నందున విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో నాథన్ కౌల్టర్ నైల్ స్థానంలో న్యూజిలాండ్ ఆల్రౌండర్ కోరె ఆండర్సన్ను ఆర్సీబీ జట్టులోకి తీసుకునేందుకు ఐపీఎల్ టెక్నికల్ కమిటీ శనివారం అంగీకరించింది.
గత సీజన్లో ఢిల్లీ డేర్ డెవిల్స్కు ప్రాతినిథ్యం వహించిన కోరె ఆండర్సన్ను కనీస ధర రూ. 2 కోట్లతో బెంగళూరు జట్టులోకి తీసుకున్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. జనవరిలో జరిగిన ఐపీఎల్ వేలంలో ఆండర్సన్ను ఏ ప్రాంఛైజీ కూడా కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు.
ఇప్పుడు నాథన్ కౌల్టర్ నైల్ గాయం కారణంగా ఐపీఎల్ నుంచి తప్పుకోవడంతో అతడి స్థానంలో ఎంపికయ్యాడు. ఆండర్సన్లో అపార ప్రతిభ ఉందని, అతడు చాలా విధ్వంసకరమైన రీతిలో ఆడతాడని, ఆర్సీబీ టీమ్లోకి స్వాగతం పలుకుతున్నామని బెంగళూరు జట్టు హెడ్ కోచ్ డేనియల్ వెటోరీ చెప్పాడు.
ఐపీఎల్లో విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కెప్టెన్గా వ్యవహారిస్తున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 7నుంచి ఐపీఎల్ 11వ సీజన్ ప్రారంభం కానుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తన తొలి మ్యాచ్లో భాగంగా ఏప్రిల్ 8న కోల్కతా నైట్రైడర్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్లో జరగనుంది.