హైదరాబాద్: 2001లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తీసిన హ్యాట్రిక్తో మరింత విశ్వాసం పెరిగిందని దిగ్గజ బ్యాట్స్మన్ వీవీఎస్ లక్ష్మణ్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాపై చారిత్రక విజయానంతరం దేశమంతా తమతో కలిసి సంబరాలు చేసుకున్నారనే భావన కలిగిందన్నాడు. అప్రతిహత విజయాలు కొనసాగిస్తున్న ఆసీస్ను ఆ టెస్టులో భారత్ మట్టికరిపించిన సంగతి తెలిసిందే. ఫాలోఆన్కు వెళ్లి కూడా గంగూలీ సేన 171 పరుగుల తేడాతో గెలిచింది.
తాజాగా లక్ష్మణ్ మాట్లాడుతూ... 'కోల్కతా టెస్టులో విజయం సాధించిన తర్వాత మూడో టెస్టు కోసం వెంటనే చెన్నైకి బయలుదేరాల్సి వచ్చింది. దీంతో విజయాన్ని ఆస్వాదించడానికి పెద్దగా సమయం దొరకలేదు. కానీ..ఆసీస్పై గెలిచిన తర్వాత మాతో కలిసి దేశమంతా సంబరాలు చేసుకుందనిపించింది. మ్యాచ్లో యువ ఆటగాడు హర్భజన్ సింగ్ అద్భుతంగా ఆడాడు' అని తెలిపాడు.
''కోల్కతా టెస్టులో దిగ్గజాలు అనిల్ కుంబ్లే, జవగల్ శ్రీనాథ్ జట్టులో లేరు. దీంతో భజ్జీపైనే కెప్టెన్ సౌరవ్ గంగూలీ నమ్మకం ఉంచాడు. అతడికి అండగా నిలిచాడు. అతడి బౌలింగ్ ఎదుర్కోవడం ఎంతో కష్టమనే రీతితో భజ్జీ బౌలింగ్ చేశాడు. అంతేకాక హర్భజన్ హ్యాట్రిక్ సాధించడం అత్యంత గొప్ప విషయం. ఆ హ్యాట్రిక్తో మరింత విశ్వాసం పెరిగింది' అని లక్ష్మణ్ చెప్పాడు.
టెస్టు క్రికెట్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆస్ట్రేలియాను 2001లో ఈడెన్గార్డెన్స్ టెస్టులో ఓడించి టీమిండియా చరిత్ర సృష్టించింది. వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్ పోరాట పటిమకు హర్భజన్ సింగ్ హ్యాట్రిక్ తోడై అసాధ్యం అనుకున్న విజయాన్ని సుసాధ్యం చేసింది. సౌరవ్ గంగూలీ సారథ్యంలో చారిత్రక విజయం సాధించిన భారత్.. అప్పట్లో సంచలనం సృష్టించింది. విజయంలో లక్ష్మణ్ (59, 281), రాహుల్ ద్రవిడ్ (25, 180), హర్భజన్ సింగ్ (7/123, 6/73) కీలక పాత్ర పోషించారు.
2001 మార్చి 11 నుంచి 15 వరకు కోల్కతా ఈడెన్గార్డెన్స్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు అది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ స్టీవ్ వా (110) సెంచరీకి చేయగా.. మాథ్యూ హెడెన్ (97), జస్టిన్ లాంగర్ (58) అర్ధ శతకాలు బాదడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 445 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఏడు వికెట్లు తీసాడు. ఇందులో హ్యాట్రిక్ ఉండటం విశేషం.
తొలి ఇన్నింగ్స్లో బ్యాట్స్మెన్ తడబడటంతో 171 పరుగులకే భారత్ ఆలౌటైంది. వీవీఎస్ లక్ష్మణ్ (59) మినహా మిగిలిన వారంతా విఫలమయ్యారు. ఇక భారత్ ఓటమి దాదాపు ఖాయమే అని అందరూ అనుకున్నారు. ఇక స్టీవ్ వా టీమిండియాను ఫాలోఆన్కు ఆహ్వానించాడు. శివసుందర్ దాస్ (39), శటగోపన్ రమేశ్ (30), సచిన్ టెండూల్కర్ (10) నిరాశపరచగా.. గంగూలీ (48) పర్వాలేదనిపించాడు. వన్డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన లక్ష్మణ్ (281) టెస్టు చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు.
'ది వాల్' రాహుల్ ద్రవిడ్ (180)తో కలిసి లక్ష్మణ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ ఐదో వికెట్కు 376 పరుగులు జోడించడంతో భారత్ రెండో ఇన్నింగ్స్లో 657/7 వద్ద డిక్లేర్ చేసింది. ఆసీస్ 384 పరుగుల లక్ష్యంతో బరిలో దిగి 212కు ఆలౌటైంది. దీంతో టీమ్ఇండియా 171 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆరు వికెట్లతో హర్భజన్ మళ్లీ మాయ చేసాడు. లక్ష్మణ్ అద్భుత ఇన్నింగ్స్ కారణంగా ఆస్ట్రేలియా వరుస 16 టెస్ట్ విజయాలకు బ్రేక్ పడింది.
నెం.3లో ధోనీ కంటే కోహ్లీనే బెస్ట్: ఇర్ఫాన్