ఆ నిర్ణయం ద్రవిడ్దే:
మ్యాచ్ అనంతరం భారత వైస్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ... 'మ్యాచ్ చివరి బంతి వరకు ఆడాలన్నది మా లక్ష్యం. అందుకే సుదీర్ఘంగా బ్యాటింగ్ చేశాం. దీపక్ చహర్ అద్భుతంగా ఆడాడు. రాహుల్ ద్రవిడ్ కోచింగ్లో భారత్-ఏ తరఫున దీపక్ పరుగులు చేశాడు. అతడు భారీ షాట్లు ఆడగలడని ద్రవిడ్కు తెలుసు. అందుకే బ్యాటింగ్ ఆర్డర్లో ముందుగా పంపించారు. అతడు ఆయన నమ్మకాన్ని నిలబెట్టాడు. దీపక్ బాగా బ్యాటింగ్ చేస్తాడని మాకు తెలుసు. ఎందుకంటే రంజీల్లో అతడి బ్యాటింగ్ను చూశాం. దీపక్ను ముందుగా పంపించడం కఠినమైంది కాకున్నా.. మంచి నిర్ణయమే' అని అన్నాడు.
ఒక్కో బంతి ఆడుతూ వెళ్లాం:
'చివరి వరకు ఆడాలనే మేం పదేపదే మాట్లాడుకున్నాం. ఏ దశలోనూ ఇక మనం గెలిచినట్టే అనుకోలేదు. ఒక్కో బంతి ఆడుతూ వెళ్లాం. దీపక్ చహర్ రన్ రేట్ను 6కు మించి పెరగనివ్వలేదు. రిస్క్లేని షాట్లే ఆడాడు. అతడు నకుల్ బంతులను బాగా విసరగలడు. ఈ రెండు మ్యాచుల్లోనూ పిచ్ బ్యాటింగ్కే అనుకూలంగా ఉంది. వాతావరణం కూడా బాగుంది. నా బౌలింగ్ ప్రదర్శనపై సంతృప్తికరంగానే ఉన్నా. కోచ్ రాహల్ ద్రవిడ్ ఎక్కడా ఆందోళన చెందలేదు. ప్రశాంతంగా ఉన్నారు. మేం గెలిచాక అభినందించారు. ఇక హార్దిక్ పాండ్యాకు ఫిట్నెస్ ఇబ్బందులేం లేవు' అని భువనేశ్వర్ పేర్కొన్నాడు.
కుర్రాళ్లకు ఓ గుణపాఠం:
జట్టులోని కుర్రాళ్లకు ఈ మ్యాచ్ ఒక పాఠమని కెప్టెన్ శిఖర్ ధావన్ అన్నాడు. లక్ష్యం ఛేదించగలమన్న నమ్మకంతో బరిలోకి దిగామని వెల్లడించాడు. 'జట్టులో ప్రతి ఒక్కరు ఆత్మవిశ్వాసం ప్రదర్శించారు. లక్ష్య ఛేదనలో ఒడుదొడుకులు ఎదురయ్యాయి. అయితే నెట్స్లో దీపక్ చహర్ చక్కగా బ్యాటింగ్ చేయడం మాకు తెలుసు. మ్యాచు పరిస్థితులపై అతడికి మంచి అవగాహన ఉంది. ఆఖరి నాలుగు ఓవర్లలో వారు లెగ్ స్పిన్నర్ల బౌలింగ్లో రిస్క్ తీసుకోలేదు. లంక ప్లేయర్స్ చక్కగా ప్రణాళికలు అమలు చేశారు. స్పిన్నర్లను ముందే తీసుకొచ్చి ఒత్తిడి చేశారు. వారు శ్రమించినా మేం గెలిచినందుకు సంతోషంగా ఉంది. ఇలాంటి మ్యాచుల వల్ల కుర్రాళ్లకు అనుభవం వస్తుంది. ఏ పరిస్థితుల్లో ఎలా ఆడాలో నేర్చుకోవచ్చు' అని గబ్బర్ వివరించాడు.