హైదరాబాద్: ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్ జట్టు తరుపున ఆడి అత్యంత విజయ వంతమైన క్రికెటర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న ఇంగ్లాండ్ క్రికెటర్ క్రిస్ వోగ్స్ ఈ ఏడాది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడనున్న సంగతి తెలిసిందే.
జనవరి 27, 28 తేదీల్లో బెంగళూరు వేదికగా జరిగిన వేలంలో క్రిస్ వోక్స్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు (ఆర్సీబీ) రూ. 7.4 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వోక్స్ మాట్లాడుతూ విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఆడేందుకు ఆతృతగా ఉన్నానని అన్నాడు.
'విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, మొయిన్ అలీ లాంటి అగ్రశ్రేణి ఆటగాళ్లతో ఆడటం ఎంతో సంతోషంగా ఉంది. డ్రెస్సింగ్ రూమ్లో వీరి నుంచి నేర్చుకునేందుకు నాకు ఎంతో సమయం దొరుకుతుంది. గతంలో గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలో ఆడాను. ఇప్పుడు కోహ్లీ నాయకత్వంలో ఆడబోతున్నాను. ఐపీఎల్ కోసం ఎదురుచూస్తున్నాను' అని వోగ్స్ తెలిపాడు.
తన క్రికెట్ కెరీర్లో ఐపీఎల్లో ఆడటం ద్వారా చాలా నేర్చుకున్నానని అన్నాడు. బౌలింగ్లో మరింత మెరుగ్గా రాణించేందుకు భారత మాజీ క్రికెటర్ లక్ష్మీపతి బాలాజీ ఎంతో సాయం చేశాడని వోగ్స్ అన్నాడు. 'కోల్కతా నైట్రైడర్స్కు బౌలింగ్ మెంటార్గా ఉన్న బాలాజీ నుంచి ఎంతో నేర్చుకున్నా. అతనిచ్చిన సలహాలు, సూచనలు నాలో ఎంతో మార్పుని తెచ్చాయి' అని వోగ్స్ తెలిపాడు.