కుక్కల్ని, పిల్లుల్ని ఎలా తింటారు?:
గత డిసెంబర్లో చైనాలోని వుహాన్ నగరంలో మొదలైన కరోనా వైరస్ అంతకంతకు వ్యాప్తిచెందుతూ ప్రపంచాన్ని కుదిపివేస్తున్నది. ఈ నేపథ్యంలో షోయబ్ అక్తర్ తన యూట్యూబ్ చానెల్లో మాట్లాడుతూ... 'అసలు మీరు (చైనీయులు) గబ్బిలాలు, పాములు, కప్పలు, ఎలుకలు, కుక్కలు, పిల్లులు ఎందుకు తింటున్నారో నాకు అర్థం కావడం లేదు. వాటి రక్తం, మూత్రంతో మీరు వైరస్ను పుట్టించి ప్రపంచాన్ని ఇబ్బందుల్లోకి నెట్టారు' అని ఘాటు వ్యాఖ్యలు చేసారు.
ఏది పడితే అది తిని మహమ్మారిని తెచ్చారు:
'నేను ఇక్కడ కేవలం చైనీయుల గురించే మాట్లాడుతున్నా. గబ్బిలాలు, కప్పలు, పాములు, కుక్కలు వంటికి తినడం తమ సంస్కృతిలో భాగం అని చైనీయులు అనొచ్చు. కానీ.. ఆ సంస్కృతి మీకు లాభాన్ని కాకుండా తీవ్రమైన నష్టాన్నే మిగిల్చింది కదా. చైనాని నిషేధించాలని నేను చెప్పట్లేదు. ఏది పడితే అది తినడం సరికాదని అంటున్నా. నేను చైనీయులకు వ్యతిరేకం కాదు. అక్కడ మూగజీవాలపై ఉన్న చట్టాలనే ప్రశ్నిస్తున్నా' అని అక్తర్ పేరొన్నారు.
చైనీయులపై చాలా కోపంగా ఉంది:
'రక్తం, వ్యర్థాలను సైతం ఆహారంగా తీసుకునే చైనీయులపై చాలా కోపంగా ఉంది. ప్రపంచం మొత్తం ప్రమాదంలో పడింది. తద్వారా పర్యాటకం రంగం దెబ్బతిన్నది. ఆర్థికంగా చాలా నష్టం వాటిల్లుతోంది, అన్నిదేశాలు పతనం అవుతున్నాయి' అని అక్తర్ అన్నారు. ప్రాణాంతక వైరస్ భారత్కు చేరొద్దని కోరుకుంటున్నాని షోయబ్ తెలిపారు. భారత్లోని తన నా మిత్రులతో టచ్లో ఉన్నానని, వారంతా క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు.
పీఎస్ఎల్ కళ తప్పింది:
పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) మ్యాచ్లు ప్రేక్షకులు లేకుండా జరగడంపైనా అక్తర్ అసహనం వ్యక్తం చేశారు. దానికి కారణం.. పీఎస్ఎల్ ఆరంభమైన నాటి నుంచి ఆ దేశంలో పూర్తిస్థాయి టోర్నీ జరగడం ఇదే తొలిసారి. కరోనా ప్రభావంతో అది కూడా కళ తప్పిందని వాపోయారు. ప్రేక్షకులు లేకుండా ఆడాల్సి వస్తోందని, విదేశీ ఆటగాళ్లు వెళ్లిపోతున్నారన్నారు. అయినా ఖాళీ స్టేడియాల్లోనే ఈ లీగ్ కొనసాగుతుందని మాజీ పేసర్ వెల్లడించారు. శుక్రవారం నాటి మ్యాచ్లు ప్రేక్షకులు లేకుండానే నిర్వహించారు. ఇక ప్లేఆఫ్ మ్యాచ్లను రద్దు చేసిన నిర్వాహకులు.. మొదటి నాలుగు స్థానాల్లో ఉన్న జట్లను సెమీపైనల్కు చేరినట్టు ప్రకటించారు. మార్చి 17న సెమీఫైనల్, 18న ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.
5 వేలకు పైగా మృతి:
భారత్లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ద్వైపాక్షిక వన్డే సిరీస్ రద్దు కాగా, ఆస్ట్రేలియాలో జరగుతున్న కివీస్ సిరీస్ కూడా రద్దయింది. ఇక మార్చి 29న మొదలు కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ కూడా ఏప్రిల్ 15కు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ప్రాణాంతక కరోనా వైరస్ 145కు పైగా దేశాలకు పాకింది. 1,45, 810 మంది ఈ వైరస్ బారినపడి చికిత్స పొందుతుండగా.. 5 వేలకు పైగా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఇక భారత్లో 84 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఇద్దరు మరణించారు.