హైదరాబాద్: మలేషియాలోని బంగి వేదికగా జరిగిన ఓ టీ20 మ్యాచ్లో అద్భుతం చోటు చేసుకుంది. ఐసీసీ వరల్డ్ టీ20 ఆసియా రీజియన్ క్వాలిఫయర్ మ్యాచ్లో భాగంగా గురువారం చైనా-థాయిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.
ఈ మ్యాచ్లో చైనా జట్టు మొత్తం 20 ఓవర్లు ఆడి కేవలం 35 పరుగులు మాత్రమే చేసింది. తద్వారా టీ20 చరిత్రలో రెండో అతి తక్కువ స్కోరు నమోదైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన చైనా జట్టు కెప్టెన్ చెన్ జియార్గన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ ప్రకారం: పృథ్వీ షానే మరో సచిన్ టెండూల్కరా?
అనంతరం బ్యాటింగ్కు దిగిన చైనా జట్టు తొలి పది ఓవర్లలో 5 వికెట్లకు కేవలం 18 పరుగులు చేసింది. ఆ తర్వాత పది ఓవర్లలో మరో నాలుగు వికెట్లు కోల్పోయి 17 పరుగులు చేయగలిగింది. చైనా తరుపున ఆ జట్టు లోయర్ ఆర్డర్ బ్యాట్స్మన్ వాంగ్ య(8) టాప్ స్కోరర్గా నిలిచాడు.
చైనా మొత్తం ఇన్నింగ్స్లో కేవలం రెండే ఫోర్లు మాత్రమే నమోదయ్యాయి. ఇందులో ఒకటి చైనా కెప్టెన్ బాదగా, మరొకటి వాంగ్ య బాదాడు. మరోవైపు థాయిలాండ్ బౌలర్లు ఐదు మెయిడెన్ ఓవర్లు వేశారు. 2004లో ఐసీసీలో చేరిన చైనాకు ఈ ఏడాది మొదట్లో పూర్తిస్థాయి అంతర్జాతీయ టీ20 హోదా వచ్చింది.
థాయిలాండ్ బౌలర్ డేనియల్ జాకబ్స్ 4 ఓవర్లలో 8 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. అనంతరం 36 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన థాయిలాండ్ కేవలం 2.4 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా టార్గెట్ను థాయ్లాండ్ చేజ్ చేయడం విశేషం. 104 బంతులు మిగిలి ఉండగానే ఆ జట్టు విజయం సాధించింది.