
లండన్: భారత్ సీనియర్ బ్యాట్స్మన్, టెస్ట్ స్పెషలిస్ట్ చటేశ్వర్ పుజారా ఇంగ్లాండ్ కౌంటీ ఛాంపియన్షిప్లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. కౌంటీల్లో గ్లౌస్టర్షైర్ జట్టు తరపున 32 ఏళ్ల పుజారా బరిలో దిగనున్నాడు. ఏప్రిల్ 12 నుంచి ఆరంభమయ్యే సీజన్ కోసం గ్లౌస్టర్షైర్ జట్టుతో కలిసి ఆరు మ్యాచ్లు ఆడేందుకు బుధవారం ఒప్పందం కుదుర్చుకున్నాడు.
ఒప్పందంలో భాగంగా ఏప్రిల్ 12 నుంచి మే 22 వరకు పుజారా నాలుగు రోజుల మ్యాచ్లు 6 ఆడతాడు. దీంతో జవగళ్ శ్రీనాథ్ (1995) తర్వాత కౌంటీల్లో గ్లౌస్టర్షైర్ జట్టు తరపున ఆడనున్న భారత క్రికెటర్గా పుజారా నిలిచాడు. పుజారా కౌంటీల్లో ఆడటం ఇదేం కొత్తకాదు. గతంలో డెర్బీషైర్, యార్క్షైర్, నాటింగ్హామ్షైర్ జట్లకు అతడు ప్రాతినిధ్యం వహించాడు.
'ఈ సీజన్లో గ్లౌసెస్టర్షైర్కు ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించినందుకు సంతోషిస్తున్నాను. క్లబ్కు గొప్ప క్రికెట్ చరిత్ర ఉంది. ఇందులో భాగం అయినందుకు ఆనందంగా ఉంది. ఇది ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు క్లబ్కు కృతజ్ఞతలు తెలుపుతున్నా. సహచరులను కలుసుకోవడాని, బ్రిస్టల్కు రావడానికి వేచి చూస్తున్నా. గతంలో కౌంటీ క్రికెట్ ఆడి ఎంజాయ్ చేశాను. నా ఆటను మెరుగుపరుచుకున్నా. మరోసారి మెరుగ్గా రాణించడానికి ప్రయత్నిస్తా' అని క్లబ్ విడుదల చేసిన ఓ ప్రకటనలో పుజారా తెలిపారు.
2010లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్తో చటేశ్వర్ పుజారా భారత్ తరఫున టెస్ట్ అరంగేట్రం చేశాడు. 2012లో న్యూజిలాండ్తో హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో తొలి అంతర్జాతీయ టెస్ట్ సెంచరీ (159) చేశాడు. పుజారా అత్యధిక టెస్ట్ స్కోర్ 206 నాటౌట్. పుజారా ఇప్పటివరకు భారత్ తరఫున 75 టెస్ట్ మ్యాచ్లు ఆడి 5,740 పరుగులు చేసాడు. ఇందులో 18 సెంచరీలు, 24 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.