ముంబై: ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ని టీమిండియా ఓడిస్తుందని భారత టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ చతేశ్వర్ పుజారా ధీమా వ్యక్తం చేశాడు. స్థాయికి తగినట్లుగా ఆడితే.. ప్రపంచంలోని ఏ జట్టునైనా, ఎక్కడైనా ఓడించగలం అని పేర్కొన్నాడు. ప్రణాళికల్ని చక్కగా అమలు చేయగలిగితే.. తప్పకుండా విజయాలు సాధిస్తామని పుజారా తెలిపాడు. టీమిండియా జూన్ 2న ఇంగ్లాండ్ పర్యటకు వెళ్లనుంది. సౌథాంప్టన్ వేదికగా న్యూజిలాండ్తో జూన్ 18 నుంచి 23 వరకూ ఛాంపియన్షిప్ జరగనుంది.
టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ అనంతరం నెలరోజుల పాటు అక్కడే ఉండి కోహ్లీసేన ప్రాక్టీస్ చేయనుంది. ఆ తర్వాత ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 10 వరకూ ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్లో ఢీకొట్టబోతోంది. బుధవారం ముంబైకి చేరుకున్న టీమిండియా అక్కడ బీసీసీఐ ఏర్పాటు చేసిన కఠిన నిబంధనల మధ్య ఏడు రోజుల క్వారంటైన్లో ఉండనుంది. ముంబై నుంచి ప్రత్యేక విమానంలో ఇంగ్లండ్కి బయలుదేరనుంది. ఇదే విమానంలో భారత మహిళల జట్టు కూడా వెళ్లనున్న విషయం తెలిసిందే.
Day-Night Test: తొలి డేనైట్ టెస్టు ఆడబోతోన్న భారత్.. క్రికెట్ చరిత్రలో రెండోదే!!
ఇంగ్లండ్ పర్యటన నేపథ్యంలో తాజాగా చతేశ్వర్ పుజారా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... 'ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా కచ్చితంగా విజయాల్ని సాధిస్తుంది. గత కొన్ని నెలల నుంచి విదేశాల్లో జట్టు మెరుగ్గా రాణిస్తోంది. దాంతో జట్టులో ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. ప్రణాళికల్ని చక్కగా అమలు చేయగలిగితే.. తప్పకుండా ఇంగ్లీష్ గడ్డపై ఆధిపత్యం చెలాయించగలం. టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ని తటస్థ వేదికపై ఆడుతున్నాం. కాబట్టి రెండు జట్లకీ గెలిచేందుకు సమాన అవకాశాలుంటాయి. ఒకవేళ మేము మా స్థాయికి తగినట్లుగా ఆడితే.. ప్రపంచంలోని ఏ జట్టునైనా, ఎక్కడైనా ఓడించగలం' అని అన్నాడు.
'గత పది సంవత్సరాలలో టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్ బెంచ్ సామర్థ్యం పెరిగింది. ప్రస్తుతం చాలా మంది బ్యాకప్ ఆటగాళ్లు ఉన్నారు. అందుకు ఆసీస్ సిరీస్ మంచి ఉదాహరణ. స్టార్ ఆటగాళ్లు గాయాలపాలైనా.. కుర్రాళ్లు అదరగొట్టారు. ఇది మంచి పరిణామం. 2018లో సౌథాంప్టన్ వేదికగా జరిగిన టెస్టులో మేం ఓడిపోయాం. గతంలో పరిస్థితులు వేరు, ఇప్పుడు వేరు. జట్టు బలంగా ఉంది. కివీస్ పేస్ విభాగం గురించి ఎలాంటి ఆందోళన లేదు. వారు ఎలాంటి బంతులు వేస్తారో నాకు కాస్త అవగాహన ఉంది' అని పుజారా చెప్పాడు. ఇంగ్లండ్ గడ్డపై 2007లో చివరిగా భారత్ టెస్టు జట్టు సిరీస్ గెలవగా.. గత ఏడాది న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్లో టీమిండియా పేలవంగా ఓడిపోయిన విషయం తెలిసిందే.