భారత్ జట్టులోకి తీస్కోండి:
ఫైనల్ మ్యాచ్ అనంతరం జయదేవ్కు పుజారా అభినందనలు తెలిపాడు. 'ఉనద్కత్ ఈ సీజన్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఒకే సీజన్లో 67 వికెట్లు తీశాడంటే రంజీ ట్రోఫీలో ఇంతకన్నా మంచి ప్రదర్శన ఉండదు. అతడు చాలా ప్రాక్టికల్గా ఉంటాడు. అందుకే ఉనద్కత్ టీమిండియాలో స్థానం గురించి ఆలోచించడం లేదు. రంజీ ట్రోఫీలో 67 వికెట్లు పడగొట్టిన బౌలర్కి భారత్ జట్టులో చోటు దక్కకపోతే ఆశ్చర్యమే. ఒక్క మ్యాచ్లో కాదు.. సీజన్ ఆసాంతం నిలకడగా రాణించాడు' అని పుజారా పేర్కొన్నాడు.
భారత జట్టుకు ఆడాలని కోరుకుంటున్నా:
'నాకు తెలిసి రంజీ ట్రోఫీలో ఈ తరహాలో ఏ ఫాస్ట్ బౌలర్ రాణించలేదు. రంజీ ట్రోఫీలో మెరుగైన ప్రదర్శన కనబర్చే ఆటగాళ్లకి టీమిండియా సెలక్షన్ సమయంలో ప్రాధాన్యం ఉంటుంది. ఉనద్కత్ భారత జట్టుకు ఆడాలని కోరుకుంటున్నా' అని పుజారా అన్నాడు. ఉనద్కత్ చివరిసారిగా 2018లో బంగ్లాదేశ్పై భారత జట్టు తరఫున ఆడాడు. ప్రస్తుత రంజీ సీజన్లో ఉనద్కత్ బంతితో అద్భుతంగా రాణించాడు. సెమీఫైనల్, ఫైనల్లో మ్యాచ్లను గెలిపించే ప్రదర్శనతో దుమ్మురేపాడు. బెంగాల్తో జరిగిన ఫైనల్ మ్యాచులో విజయం సాధించిన సౌరాష్ట్ర తొలి సారి రంజీట్రోఫీ విజేతగా అవతరించింది.
ఆకలితో ఉన్నా:
మ్యాచ్ అనంతరం సౌరాష్ట్ర కెప్టెన్ ఉనద్కత్ మాట్లాడుతూ... 'భారత జట్టులో పునరాగమనం చేయాలన్న ఆకలితో ఉన్నా. ఆ కసి ఇప్పటి కన్నా ఎప్పుడూ ఎక్కువగా లేదు. అదే నన్నీ సీజన్లో ముందుకు నడిపించింది. ప్రతి మ్యాచులో సుదీర్ఘంగా బౌలింగ్ చేస్తూ సీజన్ మొత్తం ఆడాలంటే శారీరకంగా ఫాస్ట్ బౌలర్కు చాలా కష్టం. అయితే నేను మాత్రం ఇలానే కొనసాగుతా. రంజీ ట్రోఫీ గెలివడంతో కెప్టెన్గా ఎంతో సంతోషంగా ఉన్నా' అని అన్నాడు.
ఫైనల్ మ్యాచ్ డ్రా:
2019-20 సీజన్లో భాగంగా సౌరాష్ట్ర, బెంగాల్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ శుక్రవారం డ్రాగా ముగిసింది. సౌరాష్ట్ర జట్టు తొలి ఇన్నింగ్స్లో లభించిన 44 పరుగుల ఆధిక్యం కారణంగా విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్ డ్రా అయితే.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన జట్టుకే రంజీ ట్రోఫీ దక్కనున్న విషయం తెలిసిందే.