‘ఎ+’లో కెప్టెన్ కోహ్లీతో పాటు నలుగురు
సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్, కెప్టెన్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రితో భేటీ సమయంలో కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ చీఫ్ వినోద్ రాయ్ ఈ ప్రతిపాదన తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ‘ఎ+'లో కెప్టెన్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, శిఖర్ ధావన్ మాత్రమే ఉన్నారు. వీరికి రూ.7 కోట్ల చొప్పున వార్షిక వేతనం అందుతోంది.
ఏ గ్రేడ్ ఆటగాడిగా ఉన్న పుజారా
ఇక, ఏ గ్రేడ్ ఆటగాడిగా ఉన్న పుజారాకు బీసీసీఐకి ఏడాదికి రూ.5 కోట్లు చెల్లిస్తోంది. ఏ+ గ్రేడ్కి మారితే అతడికి రూ.7 కోట్లు దక్కనున్నాయి. బి, సి విభాగాల ఆటగాళ్లకు వరుసగా రూ.3 కోట్లు, రూ.కోటి చొప్పున జీతం దక్కుతోంది. అయితే, అన్ని ఫార్మాట్లలోనూ ఆడే ఆటగాళ్లకు మాత్రమే ఏ+ కేటగిరీలో చోటు ఇవ్వాలనే నిబంధన ఉండగా, దానిని సడలించడం కుదురుతుందా? అని వినోద్ రాయ్ టీమ్ మేనేజ్మెంట్ను అడగనున్నారు.
పుజారాను 'ఎ+' గ్రేడ్లోకి ప్రమోట్ చేస్తే
పుజారాను 'ఎ+' గ్రేడ్లోకి ప్రమోట్ చేస్తే, టెస్టు క్రికెట్ ఆడే యువ ఆటగాళ్లకు ప్రోత్సాహకరంగా ఉంటుందని భావిస్తున్నారు. ఒకవేళ అన్ని ఫార్మాట్లూ ఆడటం తప్పనిసరి అనే నిబంధన సడలించడం కుదరకపోతే.. ధావన్ టాప్ గ్రేడ్లో స్థానం కోల్పోయే అవకాశం ఉంది. పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్ లాంటి యువ ఆటగాళ్లు టెస్టు జట్టులో స్థానం కోసం తీవ్రంగా కృషి చేస్తుండటమే ఇందుకు కారణం.
వివాదం తలెత్తే అవకాశం
మరోవైపు టెస్టుల్లో మాత్రమే ఆడుతున్న పుజారాను ఇటీవలే జైపూర్ వేదికగా నిర్వహించిన ఐపీఎల్ వేలంలోనూ ఏ ప్రాంజైజీ కోనుగోలు చేయలేదు. అలాంటి ఆటగాడికి బోర్డు తరఫున మరింత ప్రోత్సాహం అవసరమని భావించి ‘ఎ+' కాంట్రాక్టు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. టెస్టు క్రికెట్ ఆడని ధోనీకి ఏ+ గ్రేడ్ అర్హత లేనప్పుడు.. సుదీర్ఘ ఫార్మాట్ మాత్రమే ఆడే పుజారాకు టాప్ కేటగిరీలో చోటు కల్పిస్తే వివాదం తలెత్తే అవకాశం కూడా లేకపోలేదు.