
ముంబై: టీమిండియా క్రికెటర్లు ఒక్కొక్కరుగా కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. గత మంగళవారం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్ వాయిదా పడటంతో ఢిల్లీలోని తన ఇంటికి చేరుకున్న టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్.. గురువారం వాక్సిన్ వేయించుకున్నాడు. భారత ఆటగాళ్లలో అందరికంటే ముందుగా కరోనా ఫస్ట్ డోస్ వేసుకుంది గబ్బరే. ఇక ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్, ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికయిన టీమిండియా ప్లేయర్స్ కరోనా టీకా కోసం క్యూ కట్టారు. ఇప్పటికే చాలా మంది తమ కుటుంబాలతో కలిసి కరోనా తొలి డోస్ వేయించుకున్నారు.
టీమిండియా టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానే శనివారం కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నాడు. 32 ఏళ్ల జింక్స్ తన సతీమణి రాధికతో కలిసి ముంబైలోని వ్యాక్సిన్ కేంద్రంలో కరోనా మొదటి డోసు వేయించుకున్నాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సోమవారం ముంబైలో కరోనా ఫస్ట్ డోస్ టీకా వేయించుకున్నాడు. ఫాస్ట్ బౌలర్లు ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్.. టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ చతేశ్వర్ పుజారా కూడా తొలి డోస్ వేసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకుంటున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి.. అందరూ జాగ్రత్తగా ఉండాలని, సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచిస్తున్నారు.
మరో 2-3 రోజుల్లో టెస్టులు ఆడబోతున్న టీమిండియా ప్లేయర్స్ అందరూ వ్యాక్సిన్ తీసుకునే అవకాశం ఉంది. ఇంగ్లండ్ టూర్కి ఎంపికైన క్రికెటర్లు టీకా వేయించుకోవాలంటే.. కోవాక్సిన్ కాకుండా కోవిషీల్డ్ వేయించుకోవాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సూచించినట్లు తెలుస్తోంది. ఎందుకంటే..ఇప్పుడు టీకా వేయించుకున్న క్రికెటర్లు మళ్లీ నెల రోజుల తర్వాత సెకండ్ డోస్ వేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కోవాక్సిన్ వేయించుకుంటే.. ఇంగ్లండ్లో ఆ టీకా దొరకడం కష్టం. కోవిషీల్డ్ అయితే సులువుగా అక్కడ సెకండ్ డోస్ వేయించుకోవచ్చని క్రికెటర్లకి బీసీసీఐ సూచించినట్లు సమాచారం.
భారత టెస్టు జట్టు:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, శుభమన్ గిల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, హనుమ విహారి, రిషబ్ పంత్ (కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్ధూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్.
స్టాండ్బై ప్లేయర్లు: అభిమన్యు ఈశ్వరన్, ప్రసీద్ క్రిష్ణ, అవేష్ ఖాన్, అర్జాన్ నాగ్వాస్వాల్లా.