Chetan Sakariya: ఆ క్షణం జీవితం కళ్ల ముందు కదలాడింది.. ద్రవిడ్ సర్ మాటలతో షాకయ్యా!

న్యూఢిల్లీ: శ్రీలంక పర్యటనలో భారత్ తరఫున తొలిసారి బౌలింగ్ చేసేముందు తన జీవితం కళ్ల ముందు కదలాడిందని రాజస్థాన్ రాయల్స్ పేసర్ చేతన్ సకారియా అన్నాడు. ఈ ఏడాదే ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చిన ఈ సౌరాష్ట్ర ప్లేయర్.. అనూహ్య రీతిలో భారత జట్టుకు ఎంపికై అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. ఫస్ట్ సిరీస్లోనే తనదైన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు.
తాజాగా రాజస్థాన్ రాయల్స్ మీడియా టీమ్తో మాట్లాడిన చేతన్ సకారియా శ్రీలంక పర్యటనకు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. లంకతో తాను తొలి మ్యాచ్ ఆడేటప్పుడు తొలి బంతి వేసేముందు కొద్ది నిమిషాల సమయం దొరికిందని, అప్పుడు తన జీవితంలోని ఆటుపోట్లన్నీ గుర్తొచ్చాయని యువ పేసర్ చెప్పుకొచ్చాడు. మంచి, చెడు, కష్టం, నష్టం, త్యాగాలు, విమర్శలు ఇలా అన్నీ తన కళ్లముందు కదలాడాయని పేర్కొన్నాడు. ద్రవిడ్ సర్ వచ్చి తనతో మాట్లాడటం, నా బౌలింగ్ను మెచ్చుకోవడం గొప్పగా అనిపించిందన్నాడు.

జీవితం గుర్తుకొచ్చింది..
'అది నాకు చాలా భావోద్వేగభరితమైన సందర్భం, కానీ.. అదే నాకు స్ఫూర్తి కలిగించింది. అప్పుడే నేను అత్యుత్తమ ప్రదర్శన చేయాలని మనసులో అనుకున్నా. ఇక టీమిండియాకు ఎంపికవ్వడం అనేది నా కల నేరవేరడంలాంటిది. తొలుత ఆ విషయం వినగానే నా మనసులో ఏవేవో ఆలోచనలు మొదలయ్యాయి. కానీ, నేను దాన్ని నమ్మేస్థితిలో లేను. అది నిజమా, కాదా అని నన్ను నేనే గిల్లి చూసుకున్నా. ఒకవేళ అదే నిజమైతే తుది జట్టులో ఉంటానా? లేదా? అనేది కూడా ఆలోచించలేదు. కేవలం ఆ డ్రెస్సింగ్ రూమ్లో ఉంటే చాలనుకున్నా.

రాహుల్ సర్ మాటలతో..
ఇక శ్రీలంకకు వెళ్లినప్పుడు తొలుత రాహుల్ ద్రవిడ్ను చూసి నమ్మలేకపోయా. దిగ్గజ క్రికెటర్ నా దగ్గరకు వచ్చి 'హాయ్ చేతన్.. నేను రాహుల్'నని మాట్లాడటంతో షాకయ్యా. ఇది నిజమా కలానా? అని ఆశ్చర్యపోయా. ఆయన నాతో మాట్లాడి మా కుటుంబం గురించి, నా ఆట గురించి అడిగి తెలుసుకున్నారు. సౌరాష్ట్ర టీమ్ ఎలా ఉందని ఆరా తీశారు. అలాగే ఐపీఎల్లో నా బౌలింగ్ ఫాలోయ్యారని, అద్భతుంగా బౌలింగ్ చేస్తున్నావని మెచ్చుకున్నారు. అలాంటి గొప్ప వ్యక్తి నా ఆటతీరును చూసి అభినందించడం చాలా గొప్పగా అనిపించింది' అని సకారియా సంతోషం వెలిబుచ్చాడు.

ప్లే ఆఫ్స్ పక్కా..
అనంతరం రాజస్థాన్ రాయల్స్ టీమ్పై స్పందించిన యువ పేసర్.. మిగిలిన ఐపీఎల్ సీజన్లో తమ జట్టు ప్లేఆఫ్స్ చేరుతుందనే నమ్మకం ఉందన్నాడు. ఈ సీజన్లో తాము కొన్ని నమ్మశక్యం కాని విజయాలు సాధించామని, అలాగే ఓటమిపాలైన మ్యాచ్లు కూడా స్వల్పతేడాతోనే కోల్పోయామని సకారియా గుర్తుచేసుకున్నాడు. ఇక శ్రీలంక పర్యటన తర్వాత అతడు చెన్నైలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లు చెప్పాడు. దాంతో రాబోయే ఐపీఎల్ సీజన్లో మంచి ప్రదర్శన చేస్తానని ధీమా వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే తాను వీలైనన్ని ఎక్కువ వికెట్లు తీసి జట్టును గెలిపిస్తే తాము(రాజస్థాన్) ప్లేఆఫ్స్కు వెళ్లే అవకాశం ఉందన్నాడు.

ఊహించని మలుపులు..
కాగా, ఈ ఏడాది జనవరిలో చేతన్ తన సోదరుడిని కోల్పోగా, మేలో కరోనా బారినపడి అతని తండ్రి కన్నుమూశాడు. ఇలాంటి కష్టకాలంలోనే సకారియా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఐపీఎల్, టీమిండియాకు ఎంపికయ్యాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సందర్భంగా తమ్ముడిని కోల్పోయిన సకారియా.. కడచూపునకు కూడా నోచుకోలేదు. ఆ తర్వాత అతనికి ఐపీఎల్లో భారీ కాంట్రాక్ట్ దక్కింది. భారత్ వేదికగా జరిగిన ఐపీఎల్ ఫస్టాఫ్లో సకారియా దుమ్మురేపాడు. అయితే కరోనాతో లీగ్ అర్థంతరంగా వాయిదా పడగా.. అతని తండ్రి కరోనాతో మరణించాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత జట్టులో అతనికి చోటు దక్కింది. దాంతో ఆరు నెలలోనే సకారియా జీవితం ఊహించని మలుపులు తిరిగింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications