సీఎస్కే కౌంటర్:
సంజయ్ మంజ్రేకర్ను బీసీసీఐ కామెంట్రీ ప్యానెల్ నుంచి తొలగించిందనే వార్తల నేపథ్యంలో ఐపీఎల్ ప్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) స్పందించింది. ఇకపై 'బిట్స్ అండ్ పీసెస్' గొంతు వినాల్సిన పనిలేదని మంజ్రేకర్ను ఉద్దేశించి ట్రోల్ చేసింది. గత ఏడాది రవీంద్ర జడేజాని బిట్స్ అండ్ పీసెస్ ఆటగాడంటూ ట్రోల్ చేసిన నేపథ్యంలో.. తమ ఆటగాడికి బదులుగా చెన్నై ట్వీట్తో కౌంటర్ ఇచ్చింది. జడేజా సీఎస్కే తరఫున ఆడుతున్న సంగతి తెలిసిందే.
అలాంటి క్రికెటర్లకు అభిమానిని కాదు:
గతేడాది ఇంగ్లాండ్లో జరిగిన వన్డే ప్రపంచకప్ సందర్భంగా సంజయ్ మంజ్రేకర్ ఓ టీవీ షోలో మాట్లాడుతూ.. తాను రవీంద్ర జడేజా వంటి 'బిట్స్ అండ్ పీసెస్' క్రికెటర్లకు అభిమానిని కాదన్నాడు. పూర్తి స్థాయి బ్యాట్స్మెన్, బౌలర్కాని జడేజా.. జట్టులో అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటాడు. అలాంటి అరకొర ఆటగాడి గురించి ఎక్కువ మాట్లాడను. అలాంటి క్రికెటర్లకు అభిమానిని కాదన్నాడు. ఈ విషయంపై అప్పట్లో నెటిజెన్లు అతడిని ఓ ఆట ఆడుకున్నారు. అప్పుడే జడేజా సైతం తనదైన శైలిలో ఘాటుగా స్పందించాడు.
నీ కన్నా రెండింతలు ఎక్కువ మ్యాచ్లు ఆడా:
మంజ్రేకర్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించి.. 'నీ కన్నా రెండింతలు ఎక్కువ మ్యాచ్లు ఆడాను. ఇంకా ఆడుతున్నాను. ఇతరులను గౌరవించడం నేర్చుకో. నీ నోటి దురుసు గురించి చాలా విన్నా' అని జడ్డూ ట్వీట్ చేశాడు. ప్రపంచకప్ సెమీస్ ఫైనల్లో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీతో కలిసి జడేజా కివీస్పై అద్భుతంగా పోరాడి మంజ్రేకర్ వ్యాఖ్యలు తప్పని నిరూపించాడు. దీంతో ఆ సంజయ్ క్షమాపణలు చెప్పాడు.
|
భోగ్లే, ధోనీ, సానియాలపై కూడా:
సంజయ్ మంజ్రేకర్ కామెంట్రీపై గత రెండేళ్లుగా తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. 2018 ఐపీఎల్ సమయంలో ముంబై ఇండియన్స్ హిట్టర్ కీరన్ పొలార్డ్ని మతిలేని ఆటగాడంటూ వ్యాఖ్యానించాడు. తర్వాత పలు సందర్భాల్లో హర్షాభోగ్లే, ధోనీ, సానియా మిర్జాలను ఇలాగే అవమానించే ప్రయత్నం చేసి నెటిజెన్ల ఆగ్రహానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ అతని తీరు నచ్చక కామెంట్రీ ప్యానెల్ నుంచి తొలగించిందని సమాచారం.