ఢిల్లీ: లఢక్లోని గాల్వన్ లోయలో చైనా సైనికుల దుశ్చర్య కారణంగా మృతిచెందిన భారత వీర జవాన్ల మరణాలపై వివాదాస్పద రీతిలో ట్వీట్ చేసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) వైద్యుడిపై ఆ జట్టు యాజమాన్యం వేటు వేసింది. అతడిని సస్పెండ్ చేస్తున్నట్లు బుధవారం సీఎస్కే యాజమాన్యం ప్రకటించింది.
తూర్పు లద్దాఖ్లోని గాల్వన్ లోయలో చైనాతో ఆరు వారాలుగా నెలకొన్న సరిహద్దు ప్రతిష్టంభన సోమవారం హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. దాదాపు 4 దశాబ్దాల తర్వాత మళ్లీ భారత్, చైనా సరిహద్దుల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాలకు చెందిన సైనికులు భౌతిక ఘర్షణకు దిగారు. దీంతో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ప్రజలు, ప్రముఖులు స్పందిస్తున్నారు. చైనా వైఖరిని దూషిస్తూ భారత అమర జవాన్లకు నివాళులు అర్పిస్తున్నారు.
అయితే అమర జవాన్ల మరణాలను కించపరుస్తూ సీఎస్కే జట్టు వైద్యుడు మధు ట్విటర్లో పోస్ట్ చేశాడు. 'జవాన్ల శవపేటికలపై పీఎం కేర్స్ స్టిక్కర్ని అతికిస్తారేమో!!. ఆసక్తికొద్ధి అడుగుతున్నా' అని మధు ట్వీట్ చేశాడు. దీంతో నెటిజన్లు అతడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ జట్టుకు డాక్టర్గా ఉంటూ.. జవాన్లు, ప్రధాని నరేంద్ర మోడీని కించపరుస్తూ ట్వీట్ చేస్తావా? అని విరుచుకుపడ్డారు.
మధు ట్వీట్పై వివాదం చెలరేగడంతో సీఎస్కే ఫ్రాంఛైజీ.. అతడ్ని వెంటనే సస్పెండ్ చేసింది. ఆ ట్వీట్ అతని వ్యక్తిగతమైనప్పటికీ.. తాము చింతిస్తున్నామని తెలిపింది. 'మధు వ్యక్తిగత ట్వీట్ గురించి చెన్నై సూపర్ కింగ్స్కు తెలియదు. అయితే జట్టు వైద్యుడి స్థానం నుంచి అతడిని తొలగిస్తున్నాం. అతడి చెత్త ట్వీట్పై సీఎస్కే చింతిస్తుంది' అని పేర్కొంది. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ సీఎస్కే ఫ్రాంఛైజీ ఓనర్ అన్న విషయం తెలిసిందే. ఇక సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆర్మీలో లెప్టెనెంట్ కల్నల్ (గౌరవ) హోదాలో ఉన్నాడు.
మణిపూర్లో ట్రాన్స్జెండర్స్ ఫుట్బాల్ జట్టు!!