న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్పై తీవ్రంగా చర్చ జరుగుతున్న వేళ.. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్)కే ఫిజియో టామీ సిమ్సెక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల లాక్ డౌన్ కు ముందు సీఎస్కే నిర్వహించిన ట్రైనింగ్ క్యాంప్ లో ధోనీ ఎంతో తీవ్రంగా సాధన చేశాడని, ఈ పదేళ్లలో ధోనీ కీపింగ్ ప్రాక్టీసు చేయడాన్ని మొట్టమొదటిసారి చూశానని టామీ సిమ్సెక్ తెలిపాడు. ఐపీఎల్ లో రాణించాలన్న పట్టుదల ధోనీలో కనిపించిందని, తద్వారా టి20 వరల్డ్ కప్ లో ఆడే టీమిండియాలో స్థానం కోసం ధోనీ ఎంత శ్రమిస్తున్నాడో అర్థమవుతోందని సిమ్సెక్ వివరించాడు.
'గత పదేళ్లలో ధోనీ కీపింగ్ ప్రాక్టీస్ చేయడం తొలి సారి చూశా. అదే అతను టీ20 ప్రపంచకప్ ఆడాలనే పట్టుదలతో ధోనీ ఉన్నాడనే విషయాన్ని తెలియజేసింది'అని. 'స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్'షోలో సిమెక్స్ చెప్పుకొచ్చాడు.
ఇక వన్డే వరల్డ్ కప్ ఓటమి అనంతరం దాదాపు 9 నెలలు ఆటకు దూరమైన ధోనీ.. ఈ సీజన్ ఐపీఎల్ కోసం సీఎస్కే నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్లో మళ్లీ బ్యాట్ పట్టిన విషయం తెలిసిందే. తన పునరాగమనం ఐపీఎల్తో ముడిపడిందనే అభిప్రాయ వ్యక్తమవుతున్న తరుణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ధోనీ సీరియస్గా ప్రాక్టీస్ చేశాడు. తన స్నేహితుడొకరు కూడా ఇదే విషయాన్ని తెలియజేశారు. రిటైర్మెంట్ ప్రస్తావన తీస్తే ధోనీ సీరియస్ అవుతున్నాడని, ఇప్పటికీ తనే బెస్ట్ కెప్టెన్ అని ఫీలవుతున్నాడని తెలిపిన విషయం తెలిసిందే.
వాస్తవానికి మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ 2020 సీజన్.. కరోనా కారణంగా ఏప్రిల్ 15కు వాయిదా పడటం.. ప్రస్తుతం నిరవధికంగా వాయిదా పడే అవకాశం ఉండటంతో ధోనీ భవితవ్యంపై తీవ్ర చర్చ మొదలైంది. మరోవైపు మాజీ క్రికెటర్లు ధోనీ కెరీర్ ముగిసినట్లేనని అభిప్రాయపడుతున్నారు. పాక్ పేసర్ షోయబ్ అక్తర్ కూడా ధోనీ ఇప్పటికే ఆటకు వీడ్కోలు పలకాల్సిందన్నాడు.