సుప్రీం తీర్పుని అపహాస్యం చేయడమే: దాదా కోసం బీసీసీఐ రాజ్యాంగంలో సవరణలు!

హైదరాబాద్: సుప్రీంకోర్టు ఆమోదించిన బీసీసీఐ రాజ్యాంగాన్ని సవరించడమంటే అపహాస్యం చేయడమేనని లోధా కమిటీ ప్యానెల్ కార్యదర్శి గోపాల్ శంకర నారాయణన్ స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు సూచనల మేరకు రూపొందిన బోర్డు రాజ్యాంగానికి మార్పులు చేయడం సరికాదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పదవీ కాలాన్ని పొడిగించడం కోసం బీసీసీఐ రాజ్యాంగాన్ని సవరించేందుకు బోర్డు సభ్యులు సిద్ధమయ్యారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం అధ్యక్షుడి పదవీకాలం గరిష్ఠంగా మూడేళ్లు ఉంటుంది. అయితే, గంగూలీ మాత్రం తొమ్మిది నెలలపాటే ఈ పదవిలో కొనసాగుతాడు.
ఈ నేపథ్యంలో బీసీసీఐ రాజ్యాంగానికే మార్పులు చేయాలనే ఆలోచనతో బోర్డు సభ్యులు ఉన్నారు. ముంబైలోని బీసీసీఐ హెడ్ క్వార్టర్స్లో డిసెంబర్ 1న బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నేతృత్వంలో 88వ వార్షిక సర్వసభ్య సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సెక్రటరీ జైషా మొత్తం 12 పాయింట్లతో కూడిన ఏజెండాను బోర్డు సభ్యుల ముందు ఉంచనున్నారు.

అధ్యక్షుడు, కార్యదర్శిల పదవీకాలం మూడేళ్లు ఉండేలా
ఈ సమావేశంలో బోర్డు అధ్యక్షుడు, కార్యదర్శిల పదవీకాలం మూడేళ్లు ఉండేలా సవరణ చేసేందుకు సిద్ధమవుతున్నారు. బీసీసీఐ రాజ్యాంగాన్ని సవరించాలంటే బోర్డు సభ్యుల్లో నాలుగింట మూడో వంతు మద్దతు అవసరం. అలాగే బోర్డు సభ్యులు మద్దతు తర్వాత సుప్రీంకోర్టు ఆమోదం కూడా తప్పనిసరి.

రాజ్యాంగ సవరణ వార్తలపై
బీసీసీఐ రాజ్యాంగ సవరణ వార్తలపై గోపాల్ శంకర నారాయణన్ మాట్లాడుతూ "వాస్తవానికి ఇలాంటి ప్రయత్నాలు కోర్టు తీర్పును అపహాస్యం చేయడమే అవుతుంది. వెంటనే ఈ విషయంలో కోర్టు తగిన చర్యలు తీసుకోవాలి. ఒకవేళ బోర్డు సభ్యులు చేస్తున్న ప్రతిపాదనలు ఆమోదం పొందితే ఇన్నాళ్లుగా చేస్తున్న ప్రయత్నాలు వృథా అయినట్టే" అని అన్నారు.

మెజారిటీ సభ్యుల ఆమోదం పొందినా
"మళ్లీ పాత రోజులకు వెళ్లినట్టే. కోర్టు పట్టించుకోకుంటే దాన్ని కూడా వారు అనుకూలంగా మార్చుకుంటారు. మా ప్రయత్నాలను అడ్డుకోలేదు కాబట్టి మరిన్ని సవరణలు చేస్తామంటారు. బోర్డు ప్రతిపాదనలకు ఏకగ్రీవం లేక మెజారిటీ సభ్యుల ఆమోదం పొందినా కూడా ఈ విషయంలో కల్పించుకునేందుకు సుప్రీం కోర్టుకు అవకాశం ఉంది" అని ఆయన అన్నారు.

ఆరేళ్ల క్రితం ఐపీఎల్లో వెలుగు చూసిన స్పాట్ ఫిక్సింగ్
ఆరేళ్ల క్రితం ఐపీఎల్లో వెలుగు చూసిన మ్యాచ్ ఫిక్సింగ్ కారణంతో భారత క్రికెట్ బోర్డు ప్రక్షాళన కోసం జస్టిస్ ఆర్ఎం లోధా ప్యానెల్ను అప్పట్లో సుప్రీం కోర్టు నియమించింది. లోధా ప్యానెల్ సూచించిన సంస్కరణల కారణంగా బీసీసీఐ రాజ్యాంగంలో చాలా మార్పులో చోటు చేసుకున్నాయి.

కూలింగ్ ఆఫ్ పీరియడ్
ముఖ్యంగా ఆఫీస్ బేరర్ల గరిష్ఠ పదవీ కాలం, కూలింగ్ ఆఫ్ పీరియడ్ వంటి నిబంధనలు చాలా మందికి మింగుడు పడకుండా చేశాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే కొత్తగా ఎంపికైన బీసీసీఐ బోర్డు సభ్యులు కొన్ని నిబంధలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీసీసీఐ రాజ్యాంగాన్ని సవరించేందుకు సిద్ధమయ్యారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications