భారీ మార్పులు ఖాయం
తుది జట్టు విషయంలో ఎంఎస్ ధోనీ యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వకపోవడంపై అందరూ మండిపడ్డారు. చెన్నై జట్టుని ఇప్పటికే డాడీస్ ఆర్మీగా పిలుస్తున్నారు. ఆ జట్టులో అందరూ 30 ఏళ్లకు పైబడినవారే. ఎవరూ అంతగా రాణించట్లేదు. ఈ నేపథ్యంలో వచ్చే సీజన్ కోసం జట్టులో భారీ మార్పులు ఖాయంగా కనిపిస్తోంది. యువ ఆటగాళ్లను జట్టులోకి తీసుకొని వయసు మీద పడిన వారికి ఉద్వాసన పలుకుతారని ప్రచారం జరుగుతోంది. ఇక ధోనీని కూడా కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నారని వార్తలు వచ్చాయి. కానీ తమకి అలాంటి ఆలోచనే లేదని చెన్నై జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్ తాజాగా స్పష్టం చేశారు. ఐపీఎల్ 2021లో చెన్నైకి ధోనీనే కెప్టెన్ అని, ఒక సీజన్లో ఫెయిలైనంత మాత్రానా అన్నీ మార్చేస్తారనుకోవడం పొరపాటు అని పేర్కొన్నారు.
ఐపీఎల్ 2021కి ధోనీనే సారథి
తాజాగా చెన్నై జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... 'కచ్చితంగా.. ఐపీఎల్ 2021 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఎంఎస్ ధోనీ నాయకత్వం వహిస్తాడని మాకు గట్టి నమ్మకం ఉంది. చెన్నైకి మహీ మూడు టైటిల్స్ అందించాడు. తొలిసారి చెన్నై ప్లేఆఫ్కి అర్హత సాధించలేకపోయింది. ఐపీఎల్లో ఏ జట్టు కూడా ఆడిన ప్రతి సీజన్లోనూ ప్లేఆఫ్కి చేరలేదు. ఏదో ఒక సీజన్లో ఫెయిలైనంత మాత్రానా అన్నీ మార్చేస్తారనుకోవడం పొరపాటు' అని అన్నారు.
రైనా లోటు కనబడుతోంది
'చెన్నై జట్టు ఈ సీజన్లో సామర్థ్యానికి తగినట్టు ఆడలేదు. కొన్ని గెలవాల్సిన మ్యాచులను కోల్పోయాం. అదే చెన్నైని వెనకపడేలా చేసింది. చివరకు మూల్యం చెల్లించుకున్నాం. సురేష్ రైనా, హర్భజన్ సింగ్ టోర్నీ నుంచి తప్పుకోవడం.. యూఏఈ చేరగానే జట్టులో సబ్యులకు కరోనా సోకడం లాంటివి జట్టు సమతుల్యతను దెబ్బతీశాయి' అని కాశీ విశ్వనాథన్ పేర్కొన్నారు. ఈ సీజన్లో ఫాఫ్ డుప్లెసిస్, సామ్ కరన్ మినహా ఎవరూ రాణించలేకపోయారు. రైనా లేని లోటు స్పష్టంగా తెలిసింది.
ఇంకా రెండు మ్యాచులే
ఐపీఎల్ 2020లో చెన్నై సూపర్ కింగ్స్ లీగ్ దశలో ఇంకా రెండు మ్యాచులు ఆడాల్సి ఉంది. చెన్నై తన తర్వాత మ్యాచ్ని గురువారం దుబాయ్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో ఆడనుంది. ఇక నవంబరు 1న కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో అబుదాబి వేదికగా చివరి లీగ్ మ్యాచ్లో ఆడుతుంది. ఈ ఏడాదికి చెన్నై ఆడే చివరి మ్యాచ్ అదే అవ్వనుంది. ఈ రెండింటిలో విజయాలు అందుకుని లీగ్ నుంచి సగర్వంగా నిష్క్రమించాలని చూస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
'వీడియోకాల్ ద్వారా తండ్రి అంత్యక్రియల్లో భాగమయ్యాడు.. మన్దీప్ సింగ్ను చూసి భావోద్వేగం చెందా'