
హైదరాబాద్: చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఐపీఎల్ మ్యాచ్ నిర్వహించొద్దంటూ చెన్నై వాసుల నుంచి తీవ్ర వ్యతిరేకత చెలరేగింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ భారీ భద్రతను ఏర్పాటు చేసి స్టేడియంలోకి వాటర్ బ్యాటిల్స్ వంటివి సైతం అనుమతించొద్దంటూ ఆంక్షలు జారీ చేసింది. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ స్థానిక ఆటగాళ్లు ఆందోళన చేయడానికి వెనుకాడలేదు.
ఈ నేపథ్యంలో చెన్నై సూపర్కింగ్స్ (సీఎస్కే)-కోల్కతా నైట్రైడర్స్(కేకేఆర్) మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఆందోళనకారులు మైదానంలోకి చెప్పులు విసిరారు. కోల్కతా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అప్పర్ టయర్ నుంచి మెయిన్ పెవిలియన్లోకి కొందరు వ్యక్తులు చెప్పులు విసిరారు. దీంతో మ్యాచ్లో ఆడని డుప్లెసిస్, బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న రవీంద్ర జడేజా మైదానంలో పడిన చెప్పులను బయటకు విసిరేశారు.
ఈ దుశ్చర్యకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డుప్లెసిస్, జడేజాలను ట్విటర్లో ట్యాగ్ చేస్తూ.. 'మేం మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. స్టేడియంలో జరిగిన ఘటనకు చింతిస్తున్నాం. ఇందుకు క్షమాపణలు చెబుతున్నాం. మా గురించి తప్పుగా భావించొద్దు. మీరంటే మాకు అమితమైన గౌరవం ఉంది.' అంటూ పలువురు ఫ్యాన్స్ ట్వీట్లు చేశారు.
కావేరి నదీ జలాల యాజమాన్య బోర్డు ఏర్పాటు కోసం ఉద్ధృతంగా ఆందోళనలు జరగుతున్న సమయంలో చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించరాదంటూ ఆందోళనకారులు మొదటినుంచీ వ్యతిరేకత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.