హైదరాబాద్: బిడ్డింగ్లో వచ్చే ఐదేళ్ల కాలానికి గాను (2018-22) స్టార్ ఇండియా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రసార హక్కులను రూ. 16వేల కోట్లకు పైగా చెల్లించి సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తద్వారా ఐపీఎల్ సత్తా ఏంటో యావత్ ప్రపంచానికి తెలిసింది. దీంతో ప్రపంచంలో ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) తర్వాత అత్యంత ఖరీదైన టోర్నీగా ఐపీఎల్ నిలిచింది.
ఐపీఎల్ పుణ్యమా అనే ప్రపంచంలోనే అనేక దేశాలు టీ20 క్రికెట్ పట్ల ఆసక్తిని కనబర్చాయి. ఐపీఎల్కు వస్తున్న ఆదాయాన్ని దృష్టిలో పెట్టుుకని ఆస్ట్రేలియా, పాకిస్థాన్, వెస్టిండిస్, దక్షిణాఫ్రికా లాంటి దేశాల్లో ఆయా దేశాల బోర్డులు టీ20 సిరిస్ లీగ్లను ప్రారంభించి సక్సెస్ అయ్యాయి. తాజాగా ఈ కోవలోకి కెనడా చేరింది.
ఐపీఎల్ 2018 షెడ్యూల్ విడుదల: మ్యాచ్ టైమింగ్స్, వేదికల వివరాలివే
ఇండియా, పాకిస్తాన్, కరేబియన్ సంతతి వ్యక్తులతో కెనడా జనాభా పెరగడంతో ఐపీఎల్ తరహాలోనే అక్కడ కూడా కెనడా ప్రీమియర్ లీగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. టొరొంటోకు చెందిన భారత సంతతి వ్యాపార వేత్త రాయ్ సింగ్ ఈ క్రికెట్ లీగ్ను ప్రారంభించేందుకు ఆసక్తిగా ఉన్నారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 'ఇండియన్ ప్రీమియర్ లీగ్ విజయవంత కావడం చూశాను. ఇట్లాంటిదే కెనడా, అమెరికాలో ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాను. దీనికి సరియైన మౌళిక సదుపాయాలు అవసరం. వాటిని సమకూర్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాను' అని అన్నారు.
'నయాగారా జలపాతానికి కొద్ది దూరంలోనే 153 ఎకరాల భూమి కొంటున్నాం. నయగారా జలపాతం నుంచి కేవలం 8 నిమిషాల్లో అక్కడికి చేరుకోవచ్చు. అక్కడే ఇండోర్ క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు ప్రయత్నాలు మొదలెట్టాం. ఇది ఖర్చుతో కూడుకున్న విషయం' అని తెలిపారు.
'కెనడా ప్రీమియర్ లీగ్లో ప్రతీ ఏడాది 27 మ్యాచ్లు జరుగుతాయి. మొత్తం 10 జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తాం. క్రికెట్ను అభిమానించే, ఇష్టపడే వ్యాపారవేత్తగా టీ20 క్రికెట్ను పెద్ద వ్యాపారంగా చూస్తున్నాను. ఐపీఎల్ తరహాలో మ్యాచ్ బ్రాడ్కాస్టింగ్, అభిమానులను స్టేడియానికి రప్పించడం వంటివి ఖర్చుతో కూడి విషయాలు' అని చెప్పుకొచ్చాడు.
'టిక్కెట్లు, స్పాన్సర్షిప్లు, ప్రొమోషన్స్, బ్రాడ్కాస్టింగ్ ద్వారా ఆదాయం పొందవచ్చు. ఒక్క అమెరికాలోనే 27 మిలియన్ల మంది ప్రీమియర్ లీగ్ చూస్తారని అంచనా. ఈ లీగ్ను ఇండియా, కరీబియన్తో పాటు క్రికెట్ చూసే అన్నిదేశాలలో బ్రాడ్కాస్టింగ్ చేస్తాం. నాకు వివ్ రిచర్డ్స్, రిచీ రిచర్డ్సన్, క్లైవ్ లాయిడ్, డినేష్ రాందిన్, డ్వేన్ బ్రావో తెలుసు. వాళ్లను ఇక్కడికి తీసుకువచ్చి కెనడియన్ ప్రీమియర్ లీగ్ను ప్రొమోట్ చేస్తా' అని పేర్కొన్నాడు.
కెనడాలో మొదటి టీ20 మ్యాచ్ 2008 మేలో జరిగిందని చెప్పాడు. 'నిజానికి క్రికెట్ చరిత్రలో మొదటి టెస్టు మ్యాచ్ 1844, సెప్టెంబర్ 25న న్యూయార్క్లోని సెయింట్ జార్జి క్లబ్లో జరిగింది. మూడు రోజుల పాటు కెనడా, అమెరికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కెనడా 23 పరుగుల తేడాతో గెలిచింది. కానీ క్రికెట్ రికార్డులో ఈ విషయం నమోదు కాలేదు' అని తెలిపాడు.
టైమ్ మారలేదు!: ఐపీఎల్లో తొలి మ్యాచ్ ఆడబోయేది ఎవరో తెలుసా?
'అయితే, అధికారికంగా 1877 సంవత్సరం మెల్బోర్న్లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్టు జరిగింది. 150 సంవత్సరాల క్రితం వరకూ కెనడా అధికార క్రీడ క్రికెట్. అయితే స్పోర్ట్స్ గవర్నింగ్ బాడీ నుంచి క్రికెట్ను తొలగించే వరకూ. కెనడియన్ క్రికెట్ అసోసియేషన్ 1892లో ఏర్పాటు అయింది' అని తెలిపాడు.
ఎప్పుడైతే ఇండియా, పాకిస్థాన్, వెస్టిండిస్, శ్రీలంకకు చెందిన ఫస్ట్ క్లాస్ క్రికెటర్లు కెనడాకు వచ్చారో అప్పటి నుంచి కెనడాలో క్రికెట్ ఆడటం మొదలుపెట్టారని అన్నాడు. 2008లో కెనడా ప్రభుత్వం క్రికెట్ను ఓ జాతీయ క్రీడగా గుర్తించి నిధులు కూడా కేటాయిస్తామని హామీ ఇచ్చిందని రాయ్ సింగ్ పేర్కొన్నాడు.