
హైదరాబాద్: శ్రీలంక, భారత్, బంగ్లాదేశ్ల మధ్య శ్రీలంకలో జరగనున్న నిదాస్ ట్రోఫీకి శ్రీలంక వేదిక కానుంది. ఇంతకుముందు భారత్తో ఆడిన సిరీస్లలో వరుస పరాజయాలు ఎదుర్కొన్న లంక జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది.
మోకాలి గాయంతో బాధపడుతున్న శ్రీలంక ఆల్రౌండర్, వన్డే కెప్టెన్ ఏంజిలో మాథ్యూస్ ముక్కోణపు టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు(ఎస్ఎల్సీ) ప్రకటించింది. ట్రై సిరీస్ నుంచి మాథ్యూస్ అనుకోకుండా తప్పుకోవడం నిరాశకు గురి చేసిందని లంక మేనేజ్మెంట్ పేర్కొంది.
బంగ్లాదేశ్ టూర్లో కాలి భాగంలోని కండరాలు పట్టేడయంతో ఒకే ఒక్క మ్యాచ్ ఆడి స్వదేశం చేరుకున్న ఈ 30 ఏళ్ల క్రికెటర్ ప్రస్తుతం కొలంబోలోని రిహాబిలిటేషన్ సెంటర్లో ఉన్నాడు.
మాథ్యూస్కు గాయం పెద్దది కాకపోయినా, ఎస్ఎల్సీ వైద్య బృందం నుంచి క్లియరెన్స్ లభించలేదు. ఫలితంగా మ్యాచ్కు దూరం కానున్నాడు.
ముక్కోణపు టోర్నీ నాటికి తిరిగి సిద్ధమవాలని భావిస్తున్న మాథ్యూస్కు శిక్షణ సమయంలో మోకాలికి గాయం కావడంతో టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న దేశవాళీ టీ20 పోటీల్లో పాల్గొని తమ ఫిట్నెస్ను నిరూపించుకోవాల్సిందిగా మాథ్యూస్, నువాన్ ప్రదీప్, కుశాల్ జనిత్ పెరీరా, దుష్మంత చమీరాలకు శ్రీలంక క్రికెట్ బోర్డు ఆదేశించింది.
మాథ్యూస్ ఆరోగ్యం ఇంకా సరిపడకపోవడంతో నాయకత్వ బాధ్యతలు ప్రశ్నార్థకంగా మారాయి. ఇంతకుముందు బంగ్లాదేశ్తో జరిగిన వన్డే సిరీస్కు నాయకత్వ బాధ్యతలు నిర్వర్తించిన దినేశ్ చండీమల్ ముక్కోణపు టోర్నీకి కూడా కెప్టెన్గా వ్యవహరించే అవకాశం ఉంది. నిదాస్ ట్రోఫీ వచ్చే నెల 6న ప్రారంభం కానుండగా శ్రీలంక తన తొలి మ్యాచ్లో భారత్తో తలపడనుంది.
టోర్నీలో ఆడనున్న భారత జట్టు ఆటగాళ్లు:
రోహిత్శర్మ(కెప్టెన్), శిఖర్ ధావన్(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సురేశ్ రైనా, మనీశ్ పాండే, దినేశ్ కార్తీక్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, యజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, విజయ్ శంకర్, శార్దూల్ ఠాకూర్, జయ్దేవ్ ఉనద్కత్, మహమ్మద్ సిరాజ్, రిషబ్ పంత్.