బ్రిస్బేన్: సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా క్రికెటర్లను గాయాల పరంపర వీడడం లేదు. బ్రిస్బేన్లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగవ టెస్ట్ తొలి రోజున పేసర్ నవదీప్ సైనీ గాయపడ్డ విషయం తెలిసిందే. గజ్జల్లో తీవ్ర నొప్పి రావడంతో అతను మైదానం నుంచి తప్పుకున్నాడు. 36వ ఓవర్ బౌలింగ్ చేస్తుండగా ఇబ్బంది పడడంతో ఫిజియో వచ్చి పరీక్షించాడు. దీంతో సైనీ మైదానం వీడాడు. ఈ ఓవర్లో 5 బంతులు మాత్రమే వేయగా.. చివరి బంతిని వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ పూర్తిచేశాడు.
మ్యాచ్ అనంతరం నవదీప్ సైనీకి టీమిండియా మేనేజ్మెంట్ స్కానింగ్ కూడా చేసింది. అయితే ఇవాళ రెండవ రోజు కూడా సైనీ.. బౌలింగ్ చేసేందుకు మైదానంలోకి రాలేదు. అతనికి అయిన గాయం తీవ్రంగా ఉండడంతోనే సైనీ బౌలింగ్ చేయలేదని తెలుస్తోంది. సైనీ ఫిట్గా లేకపోవడం భారత క్రికెట్కు ఇదో చేదువార్తే. అయితే బౌలింగ్ చేసేందుకు సైనీ రాకున్నా.. మిగితా బౌలర్లు ఆసీస్ ఆటగాళ్లను త్వరగానే ఆలౌట్ చేశారు.
నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 369 పరుగులకు ఆలౌటైంది. 274/5 ఓవర్ నైట్ స్కోర్తో రెండోరోజు ఆట కొనసాగించిన ఆసీస్.. మరో 95 పరుగులు చేసి చివరి 5 వికెట్లు కోల్పోయింది. టిమ్ పైన్ (50; 104 బంతుల్లో 6x4), కామెరూన్ గ్రీన్ (47; 107 బంతుల్లో 6x4) రాణించారు. తొలి రోజు ఆటలో మార్నస్ లబుషేన్ (108; 204 బంతుల్లో 9x4) శతకం సాధించిన సంగతి తెలిసిందే. భారత బౌలర్లలో శార్దుల్ ఠాకుర్, వాషింగ్టన్ సుందర్, టీ నటరాజన్ మూడేసి వికెట్లు తీశారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ శుభ్మన్గిల్ (7) ఔటయ్యాడు. పాట్ కమిన్స్ వేసిన 6.2వ ఓవర్కు స్లిప్లో స్టీవ్ స్మిత్ చేతికి చిక్కాడు. దీంతో భారత్ 11 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఆపై రోహిత్ శర్మ, చేటేశ్వర్ పుజారా మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు. రోహిత్ ధాటిగా ఆడుతూ హాఫ్ సెంచరీ ముందు క్యాచ్ ఔట్ అయ్యాడు. క్రీజులో పుజారా (8), అజింక్య రహానే (1) ఉన్నారు. భారత్ 25 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 61 రన్స్ చేసింది.
India vs Australia: భారీ షాక్.. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా