బ్రిస్బేన్: టీమిండియాతో గబ్బా మైదానంలో జరుగుతున్న చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా నాలుగు వికెట్లు కోల్పోయింది. హైదరాబాద్ పేసర్ మొహ్మద్ సిరాజ్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టాడు. 30వ ఓవర్ రెండో బంతికి మార్నస్ లబుషేన్ (25)ను ఔట్ చేయగా.. ఆరో బంతికి మాథ్యూ వేడ్ను డకౌట్ చేశాడు. లబుషేన్ క్యాచును రోహిత్ శర్మ, వేడ్ క్యాచును వికెట్ కీపర్ రిషబ్ పంత్ అందుకున్నారు. దీంతో ఆసీస్ 123 వద్ద రెండు కీలక వికెట్లు కోల్పోయింది.
అంతకుముందు ఆస్ట్రేలియా వరుస ఓవర్లలో ఓపెనర్లను కోల్పోయింది. 26వ ఓవర్లో ఓపెనర్ మార్కస్ హ్యారిస్ (38)ను శార్దూల్ ఠాకుర్ ఔట్ చేశాడు. బంతిని అంచనా వేయడంలో విఫలమైన హ్యారిస్.. రిషబ్ పంత్ చేతికి చిక్కాడు. తర్వాత ఓవర్ వేసిన వాషింగ్టన్ సుందర్.. అర్ధ శతకానికి చేరువవుతున్న డేవిడ్ వార్నర్ (48)ను బోల్తా కొట్టించాడు. చక్కని బంతితో వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. వార్నర్ సమీక్షకు వెళ్లినా.. ఔట్ అనే తేలింది.
ఓవర్ నైట్ స్కోరు 21/0తో నాలుగో రోజు ఆటను ఆరంభించిన ఆసీస్ ఓపెనర్లు భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. పేసర్లను సమర్ధవంతగా ఎదుర్కొని వికెట్ కాపాడుకున్నారు. దాదాపు 20 ఓవర్లు వికెట్ పడకుండా నిలకడగా ఆడుతూ పరుగులు సాధించారు. ఈ క్రమంలోనే డేవిడ్ వార్నర్ అర్ధ శతకానికి ముందు ఔట్ అయ్యాడు. హ్యారిస్ కూడా పెవిలియన్ చేరాడు. క్రీజులో స్టీవ్ స్మిత్ (12), కామెరూన్ గ్రీన్ (2) ఉన్నారు. ఆసీస్ 163 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.