టెస్టు సిరీస్ పోయినా:
తాజాగా ఈఎస్పీఎన్కు ఇచ్చిన ఇంటర్య్వూలో లారా మాట్లాడుతూ... 'గత పదేళ్లుగా విదేశీ గడ్డపై భారత్ మెరుగ్గానే ఆడుతోంది. కానీ.. న్యూజిలాండ్ పర్యటనలో ఏమైందో తెలియదు. పర్యటనకి ముందు ఎక్కువగా వన్డే, టీ20లే ఆడటం టీమిండియా వైఫల్యాలకు ఓ కారణం అని నేను అనుకుంటున్నా. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో టెస్టు సిరీస్లో రాణించలేకపోయారు. ఇలానే కొనసాగితే విదేశీ గడ్డపై టెస్టుల్లో టీమిండియాకు ఇబ్బందులు తప్పవు. అయితే ఇప్పటికీ టీమిండియా ఓ అత్యుత్తమైన పర్యాటక జట్టు' అని అన్నారు.
నిరాశ కలిగించింది:
దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో మహారాష్ట్ర పోలీసులు ఇటీవల ఏర్పాటు చేసిన 'రోడ్ సేఫ్టీ ప్రపంచ సిరీస్'ను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందిస్తూ... 'ప్రస్తుత పరిస్థితి నిరాశ కలిగించింది. కరోనా పరిస్థితులు అదుపులోకి వచ్చిన తర్వాత సిరీస్లోని మిగిలిన మ్యాచ్లను ఆడాలని ఎదురుచూస్తున్నాం. ప్రజలు క్రికెట్ కోసం ఎంతో నిరీక్షిస్తున్నారు. సెహ్వాగ్, సచిన్ వంటి లెజెండ్స్ ఆటను చూడాలని కోరుకుంటున్నారు. ఈ టోర్నమెంట్ ఎంతో అద్భుతంగా ఉంది. ఊహించిన దాని కంటే పోటీ ఎక్కువగా ఉంది. సచిన్ తిరిగి మైదానంలోకి రావడం, అతడి ఆటను ప్రజలు ఆస్వాదించడం ఎంతో బాగుంది' అని పేర్కొన్నారు.
టీ20 ప్రపంచకప్ గెలిచే సత్తా ఉంది:
'అక్టోబర్లో ఆస్ట్రేలియా గడ్డపై జరగనున్న టీ20 ప్రపంచకప్ను భారత్ ఘనంగానే ఆరంభిస్తుందనుకుంటున్నా. టీమిండియాకు కప్ను గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. జట్టులో చాలా మంది హిట్టర్లు ఉన్నారు. ఇక ఆస్ట్రేలియాకు సొంతగడ్డ కావడం ఆ జట్టుకు మరింత బలం చేకూర్చే విషయమే. అయితే ఎంత సొంత గడ్డైనా ప్రదర్శన బాగుంటేనే కప్ కొట్టగలదు' అని లారా చెప్పుకొచ్చారు.
రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ రద్దు:
బ్రియాన్ లారా ఇటీవలే రోడ్ సేప్టీ వరల్డ్ సిరీస్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. రోడ్సేప్టీపై అవగాహన కల్పించేందుకు మహరాష్ట్ర ప్రభుత్వం ఈ సిరీస్ను నిర్వహిస్తోంది. వెస్టిండీస్ లెజెండ్స్కు లారా కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. కరోనా రోజురోజుకు విస్తరిస్తుండటంతో 'రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్'ను తాత్కాలికంగా రద్దు చేసారు. సిరీస్ రద్దు కావడంతో క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, బ్రయాన్ లారాలు నిరాశ చెందారు. అయితే ఆటగాళ్లు, ప్రేక్షకుల క్షేమం కోసం ఇదే సరైన నిర్ణయమని వారు అభిప్రాయపడ్డారు.