హైదరాబాద్: ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకు ఉన్న తేడా ఏంటో న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ బ్రెండన్ మెక్కలమ్ వివరించాడు. ఈ విషయాన్ని ప్రముఖ క్రికెట్ నిపుణుడు స్కైల్డ్ బెర్నీ 'క్రికెట్ 2.0: ఇన్సైడ్ ది టీ20 రివల్యూషన్' పుస్తకంలో పేర్కొన్నాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్లో మెక్కలమ్ ఇరు జట్లకు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే.
''ఒక జట్టు.. తమ వద్ద ఎవరెవరు ఆటగాళ్లు ఉన్నారో దానికి తగ్గట్టు ప్రణాళికలు రచిస్తూ విజయం కోసం కృషి చేస్తుంది. ఆ జట్టు ఎంపిక వారి విధేయతను తెలియజేస్తుంటుంది. మరోకటి అత్యుత్తమ జట్టును తయారు చేయాలని ప్రయత్నిస్తుంటుంది. వాళ్లకి మైదానంలో ఎలా ఆడాలనే పక్కా ప్రణాళిక ఉండదు. సీఎస్కేతో పోల్చుకుంటే ఆర్సీబీ జట్టులో ఎక్కువ మార్పులు చేస్తుంది'' అని మెక్కలమ్ తెలిపాడు.
ఓ కోహ్లీ ఒక కోటి ఇవ్వరాదు.. కోట్ల ఆదాయం ఉన్న క్రికెటర్లు విరాళలు ప్రకటించరే?
ఐపీఎల్లో ఈ రెండు జట్లు అత్యంత బలమైనవే. కానీ మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని సీఎస్కే టైటిల్ను మూడు సార్లు గెలుచుకోగా.. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని ఆర్సీబీకి మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. 2016 సీజన్లో ఫైనల్ చేరినా.. సన్రైజర్స్ చేతిలో నిరాశే ఎదురైంది. ఇక కరోనా దెబ్బకు ఐపీఎల్ 2020 సీజన్ను బీసీసీఐ ఏప్రిల్ 15 వరకు వాయిదా వేసింది. కానీ దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ఈ క్యాష్ రీచ్ లీగ్ రద్దయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.