సిడ్నీ: యువ ఆటగాడు శుభ్మన్ గిల్ రూపంలో టీమిండియాకు బెస్ట్ ఓపెనర్ దొరికాడు అని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హగ్ అభిప్రాయపడ్డాడు. వచ్చే పదేళ్లలో గిల్ ప్రపంచంలోని అత్యుత్తమ టెస్ట్ ఓపెనర్లలో ఒకడిగా నిలుస్తాడని జోస్యం చెప్పాడు. టీమిండియాకి వచ్చే పదేళ్లు ఎలాంటి భయం ఉండదని హగ్ పేర్కొన్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్లో గిల్ సత్తాచాటిన సంగతి తెలిసిందే. మూడు టెస్టుల్లో 51 సగటుతో 259 పరుగులు చేశాడు. గబ్బా టెస్టు రెండో ఇన్నింగ్స్లో 91 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ రెండు టెస్టులు ఆడినా.. తన అద్భుత ప్రదర్శనతో అందరి మన్ననలు పొందాడు.
తాజాగా బ్రాడ్ హాగ్ తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ... 'శుభ్మన్ గిల్ అమ్ములపొదిలో అన్ని రకాల షాట్లు ఉన్నాయి. ఆస్ట్రేలియా బౌలర్లు టెస్టు సిరీస్లో షార్ట్ పిచ్ బంతులతో పదే పదే పరీక్షించినా.. గొప్పగా ఆడాడు. హుక్ షాట్లతో ఆ బంతులను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. నన్ను ఆకట్టుకుంది ఇదే. టెస్టు క్రికెట్లో వచ్చే పదేళ్లలో గిల్ బెస్ట్ ఓపెనర్గా ఎదుగుతాడు. టీమిండియా భవిష్యత్ అతని రూపంలో నాకు స్పష్టంగా కనిపిస్తోంది. ఓపెనర్ విషయంలో ఓ దశాబ్దం పాటు టీమిండియాకి ఇక భయం లేదు. గిల్ ఓ లెజెండ్ అవుతాడు' అని అన్నాడు.
ఆసీస్ పర్యటనలో ఓపెనర్ పృథ్వీ షా తొలి టెస్టులో విఫలమవడంతో అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని శుభ్మన్ గిల్ ఒడిసిపట్టాడు. మూడు టెస్టు మ్యాచ్లాడి 259 పరుగులు చేశాడు. తొలి మ్యాచులో గిల్ 45, 35 పరుగులతో ఆకట్టుకున్నాడు. మూడో టెస్టులో 50, 31 రన్స్ బాదాడు. ఇక గబ్బా టెస్టు తొలి ఇన్నింగ్స్లో 7 పరుగులే చేసి నిరాశపరిచినా.. రెండో ఇన్నింగ్స్లో 91 పరుగులు చేసి ఔరా అనిపించాడు. ఆస్ట్రేలియా బౌలర్లని తెగువతో అతను ఎదుర్కొన్న తీరుకి పెద్ద ఎత్తున ప్రశంసలు లభించాయి.
ఆసీస్ పర్యటన ప్రదర్శనతో స్వదేశంలో ఇంగ్లడ్తో జరిగే టెస్ట్ సిరీస్లో శుభ్మన్ గిల్ చోటు దక్కించుకున్నాడు. ఫిబ్రవరి 5 నుంచి ఇంగ్లండ్, భారత్ మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. తొలి రెండు టెస్టులకి చెన్నైలోని చెపాక్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుండగా.. ఇప్పటికే అక్కడి చేరుకున్న రెండు జట్లు ఆరు రోజుల క్వారంటైన్ని పూర్తి చేసుకుని మంగళవారం నుంచి ప్రాక్టీస్ మొదలెట్టాయి. ఈ టెస్టు సిరీస్లోనూ రోహిత్ శర్మ, శుభమన్ గిల్ భారత్ ఇన్నింగ్స్ ఆరంభించనున్నారు.
అయ్య బాబోయ్.. పంత్ హార్ట్ఎటాక్ తెప్పిస్తుంటాడు: ఫీల్డింగ్ కోచ్