హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా మంగళవారం రాత్రి పంజాబ్-రాజస్థాన్ జట్లు తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో పంజాబ్ బౌలర్ ఆండ్రూ టై అద్భుత ప్రదర్శన చేశాడు.
నాలుగు ఓవర్లు వేసిన ఆండ్రూ టై 8.5 ఎకానమీతో 34 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. దీంతో ఈ సీజన్లో మొత్తం 10 మ్యాచ్లాడిన ఆండ్రూ టై 16 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. దీంతో రాజస్థాన్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడికి ఇచ్చే పర్పల్ క్యాప్ని సొంతం చేసుకున్నాడు.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
మ్యాచ్ అనంతరం టైకు పర్పల్ క్యాప్ను అందిస్తూ గ్రేమ్ స్మిత్ ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంగా ఆండ్రూ టై భావోద్వేగానికి గురయ్యాడు. ఎందుకంటే మంగళవారం ఆండ్రూ టై తన GRANDMAను కోల్పోయాడు. దీనికి గుర్తుగా ఆండ్రూ టై తన ఎడమ చేతికి 'GRANDMA' అని రాసి ఉన్న ఆర్మ్ బ్యాండ్ను ధరించి బరిలోకి దిగాడు. వికెట్ తీసినప్పుడల్లా మోచేతి పై భాగాన్ని టై ముద్దాడాడు.
కన్నీటితో తడిసిన కళ్లతో 'ఈ రోజు నా గ్రాండ్మదర్ చనిపోయారు. నేటి ప్రదర్శనను ఆమెకు, నా కుంటుంబానికి అంకితం ఇస్తున్నాను. ఇది నాకు ఎమోషనల్ మ్యాచ్. నా జీవితంలో చాలా కఠినమైన రోజు ఇది. నేనెప్పుడూ క్రికెట్ ఆడటాన్ని ప్రేమిస్తాను' అని టై చెప్పాడు. దీనిని బట్టి ఆండ్రూ టైకి తన గ్రాండ్ మదర్ అంటే ఎంత ఇష్టమో అర్థమవుతోంది. ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ తన అధికారిక ఐపీఎల్ వెబ్సైట్లో ఉంచింది.
ఈ మ్యాచ్లో ఆండ్రూ టై అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ పంజాబ్ జట్టు ఓడిపోవడం విశేషం. రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా కింగ్స్ పంజాబ్పై తొలి మ్యాచ్లో ఎదురైన ఓటమికి రాజస్థాన్ ప్రతీకారం తీర్చకుంది.
కింగ్స్ పంజాబ్ ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ (95 నాటౌట్; 70 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు) మినహా ఎవరూ రాణించకపోవడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసి ఓటమి పాలైంది. అదే సమయంలో హ్యాట్రిక్ ఓటముల తర్వాత రాజస్థాన్ రాయల్స్ జట్టు తొలి విజయాన్ని అందుకుంది. రాజస్థాన్ బౌలర్లలో కృష్ణప్ప గౌతమ్ రెండు వికెట్లు తీయగా, జోఫ్రా ఆర్చర్, ఇష్ సోథీ, బెన్ స్టోక్స్, ఉనాద్కత్లకు తలో వికెట్ తీసుకున్నారు.