ఏమి చేయాలో తెలియక:
సౌతాంప్టన్ వేదికగా ఇంగ్లండ్-పాకిస్తాన్ల జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు సందర్భంగా షేన్ వార్న్ 2001 కోల్కతా టెస్టును నెమరువేసుకున్నాడు. ద్రవిడ్, లక్ష్మణ్ల దెబ్బకు అంతర్జాతీయ క్రికెట్లో అప్పటికే నాలుగు వేల ఓవర్లు వేసిన తనకు మతిభ్రమించిందన్నాడు. ' 2001లో ఈడెన్ గార్డెన్స్ టెస్టు ఇప్పటికీ నాకు బాగా గుర్తు. మ్యాచ్ మా చేతుల్లో ఉందనే భావిస్తే.. ద్రవిడ్, లక్ష్మణ్లు తమ బ్యాటింగ్తో తలక్రిందులు చేశారు. వారి బ్యాటింగ్ దాటికి చేసేది లేక నా పక్కనే ఉన్న ఆడమ్ గిల్క్రిస్ట్తో మూవీస్ గురించి చర్చించడం మొదలుపెట్టా. మేము క్యాప్లు కూడా మార్చుకున్నాం. ఏమి చేయాలో తెలియక ప్రతీది యత్నించాం. వారి గురించి ఆలోచన పక్కకు పెట్టడానికి నా ఫేవరెట్ సాంగ్లు కూడా పాడా' అని వార్న్ తెలిపాడు.
మతిభ్రమించినట్లు చేశారు:
'మొత్తంగా ద్రవిడ్, లక్ష్మణ్లు వారి అద్భుత బ్యాటింగ్తో మాకు మతిభ్రమించినట్లు చేశారు. 4వేల ఓవర్లు వేసిన నేను బిత్తరపోయా. ఆరోజు వారు అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడారు. నేను ఆడుతున్న సమయంలో వారిద్దరూ ఆడిన ఇన్నింగ్స్ ఎప్పటికీ చిరస్మరణీయమే. ఇక్కడ లక్ష్మణ్ ఇన్నింగ్స్ చాలా చాలా స్పెషల్. కీలక సమయంలో మ్యాచును మరో స్థాయికి తీసుకెళ్లాడు. ద్రవిడ్ కూడా అసాధారణ ఆటను కనబరిచాడు. కొన్నిసార్లు వీరు దేవుళ్లనే చెప్పాలి' అని ఆసీస్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ తెలిపాడు. వార్న్ టెస్టుల్లో 708 వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే.
171 పరుగులకే భారత్ ఆలౌట్
2001 మార్చి 11 నుంచి 15 వరకు కోల్కతా ఈడెన్గార్డెన్స్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు అది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ స్టీవ్ వా (110) సెంచరీకి చేయగా.. మాథ్యూ హెడెన్ (97), జస్టిన్ లాంగర్ (58) అర్ధ శతకాలు బాదడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 445 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఏడు వికెట్లు తీసాడు. ఇందులో హ్యాట్రిక్ ఉండటం విశేషం. తొలి ఇన్నింగ్స్లో బ్యాట్స్మెన్ తడబడటంతో 171 పరుగులకే భారత్ ఆలౌటైంది. లక్ష్మణ్ (59) మినహా మిగిలిన వారంతా విఫలమయ్యారు. ఇక భారత్ ఓటమి దాదాపు ఖాయమే అని అందరూ అనుకున్నారు. ఇక వా టీమిండియాను ఫాలోఆన్కు ఆహ్వానించాడు.
చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్:
రెండో ఇన్నింగ్స్లో శివసుందర్ దాస్ (39), శటగోపన్ రమేశ్ (30), సచిన్ టెండూల్కర్ (10) నిరాశపరచగా.. గంగూలీ (48) పర్వాలేదనిపించాడు. వన్డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన లక్ష్మణ్ (281) టెస్టు చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. ద్రవిడ్ (180) కూడా అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ ఐదో వికెట్కు 376 పరుగులు జోడించడంతో భారత్ రెండో ఇన్నింగ్స్లో 657/7 వద్ద డిక్లేర్ చేసింది. ఆసీస్ 384 పరుగుల లక్ష్యంతో బరిలో దిగి.. 212కు ఆలౌటైంది. దీంతో టీమ్ఇండియా 171 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆరు వికెట్లతో హర్భజన్ మళ్లీ మాయ చేసాడు. లక్ష్మణ్ అద్భుత ఇన్నింగ్స్ కారణంగా ఆస్ట్రేలియా వరుస 16 టెస్ట్ విజయాలకు బ్రేక్ పడింది.
బ్యాట్స్మన్కు 'ఫ్రీ హిట్'లాగా.. మాకు 'ఫ్రీ బాల్' అవకాశం ఇవ్వండి: అశ్విన్