చెన్నైకి మరో షాక్: పూణె మ్యాచ్లకు నీరు ఎలా?, ఎంసీఏకు బాంబే హైకోర్టు నోటీసులు

హైదరాబాద్: రెండేళ్ల విరామం తర్వాత ఐపీఎల్లోకి అడుగుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్కు ఈ సీజన్ ఏ మాత్రం కలిసొచ్చినట్లు కనిపించడం లేదు. ఏదో ఒక సమస్య ఆ జట్టుని వెంటాడుతూనే ఉంది. కావేరీ జల వివాదం నేపథ్యంలో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో చెన్నైలో మ్యాచ్లను జరగనివ్వమని ఇప్పటికే స్పష్టం చేసిన కొన్ని రాజకీయ పార్టీల నేతలు, సంఘాల నాయకులు నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. గతవారంలో చెన్నై వేదికగా కోల్కతాతో జరిగిన మ్యాచ్లో చెన్నై జట్టు ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఆటగాళ్లపై ఆందోళనకారులు బూట్లు విసిరి నిరసన వ్యక్తం చేశారు.

రవీంద్ర జడేజాపైకి బూట్లు విసిరిన నిరసనకారులు
లాంగ్ ఆన్లో ఫీల్డింగ్ చేస్తున్న రవీంద్ర జడేజా లక్ష్యంగా బూట్లు విసరగా, అవి గురి తప్పి బౌండరీ లైన్ వద్ద పడ్డాయి. ఆ సమయంలో అక్కడ దక్షిణాఫ్రికా ఆటగాళ్లు డుప్లెసిస్, ఎంగిడి ఉన్నారు. దీంతో ఆటకు కొద్దిసేపు అంతరాయం కలిగింది. రవీంద్ర జడేజాపై బూట్లు విసిరిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

చెన్నై ఆడే మ్యాచ్లు పూణెకు
ఈ నేపథ్యంలో మిగతా మ్యాచ్లను చెన్నైలో నిర్వహించకపోవడమే మంచిదన్న అభిప్రాయంతో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఈ సీజన్లో చెన్నై ఆడే మ్యాచ్లను పూణెకు తరలించిన సంగతి తెలిసిందే. తాజాగా పూణెలో ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణకు సంబంధించి బాంబే హైకోర్టు వివరణ కోరడంతో చెన్నై ఫ్రాంఛైజీ ఆందోళనలో పడింది.

నీటిని ఎలా సమకూర్చుకుంటున్నారో చెప్పండి
పూణె వేదికగా జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణ కోసం వినియోగించే నీటిని ఎలా సమకూర్చుకుంటున్నారో తమకు వివరణ ఇవ్వాలని శుక్రవారం మహారాష్ట్ర క్రికెట్ సంఘం(ఎంసీఏ)కు కోర్టు నోటీసులు పంపించింది. నోటీసులపై ఏప్రిల్ 18లోగా సమాధానం చెప్పాలని గడువు విధించింది.

పిచ్ను తయారుచేసేందుకు లక్షలాది లీటర్ల నీరు
అంతేకాదు మ్యాచ్ల కోసం పిచ్ను తయారుచేసేందుకు లక్షలాది లీటర్ల నీటిని ఉపయోగిస్తారు. చెన్నైలో నిర్వహించాల్సిన మ్యాచ్లను పుణెలో నిర్వహిస్తామని చెన్నై యాజమాన్యం, ఐపీఎల్ నిర్వాహకులు అధికారికంగా తెలిపిన మరుసటి రోజే కోర్టు నోటీసులు పంపడం గమనార్హం.

విదర్భ, మరాఠ్వాడా ప్రాంతాల్లోని రైతులు ధర్నాలు
వేసవి కాలంలో మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు గత కొన్ని సంవత్సరాలుగా తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. విదర్భ, మరాఠ్వాడా ప్రాంతాల్లోని రైతులు ఎన్నోసార్లు నీటి కోసం ధర్నాలు కూడా నిర్వహించడాన్ని మనం చూశాం. గత వేసవిలో మహారాష్ట్ర ప్రభుత్వం లాతోర్ ప్రాంతానికి రైళ్ల ద్వారా నీటని సరఫరా చేసిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications