హైదరాబాద్: శ్రీలంక క్రికెటర్లు మ్యాచ్లు ఆడే క్రమంలో డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న సమయంలో బిస్కెట్లు తినకూడదట. శ్రీలంక క్రికెటర్లు డ్రెస్సింగ్ రూమ్లో బిస్కెట్లు తినకూడదని బోర్డే స్వయంగా నిషేధం విధించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వరుస పరాజయాలతో లంక క్రికెటర్లు తీవ్ర ఒత్తిడికి గురవుతుంటే తాజా వార్త అభిమానులను కలవరపాటుకి గురి చేస్తోంది.
శ్రీలంక క్రికెటర్ల డ్రస్సింగ్ రూమ్లో బిస్కెట్లు తినవద్దంటూ వస్తున్న వార్తలు నిజమేనని ఆ జట్టు మేనేజర్ అసాంక గురుసిన్హా వెల్లడించారు. 'మ్యాచ్ మధ్యలో విరామ సమయంలో ఆటగాళ్లు బిస్కెట్లు తింటుంటారు. జట్టు ఫిజియో, శిక్షకుడు ఇచ్చిన ఆదేశాల కారణంగానే ఆటగాళ్లకు బిస్కెట్లు సరఫరా చేయడంపై నిషేధం విధించాం' అని అన్నారు.
'ఈ విషయం తెలియని క్యాటరింగ్ సిబ్బంది తర్వాతి రోజు యథావిధిగా బిస్కెట్ ప్యాకెట్లను డ్రస్సింగ్ రూమ్లో ఉంచారు. నేను వాటిని గుర్తించి క్యాటరింగ్ సిబ్బందికి తిరిగి ఇచ్చి అసలు విషయం చెప్పాను' అని గురుసిన్హా తెలిపారు. దీనిపై ఆటగాళ్ల నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురుకాలేదని, వారిలో వారు కూడా దీనిపై చర్చించలేదని ఆయన వివరించారు.
ప్రస్తుతం జట్టు మేనేజర్గా ఉన్న గురుసిన్హా త్వరలో ఆ పదవికి రాజీనామా సమర్పించనున్నారని, దీనిపై ఇప్పటికే శ్రీలంక క్రికెట్ బోర్డుతో చర్చించారని వస్తున్న వార్తలపై ఆయన స్పందిస్తూ ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. అయితే క్రికెటర్లు ఎందుకు బిస్కెట్లు తినకూడదు అనే దానిపై మాత్రం గురుసిన్హా వివరణ ఇవ్వలేదు.