సౌతాంప్టన్: ప్రపంచంలోనే అత్యుత్తమ పర్యాటక జట్టుగా పేరు తెచ్చుకుంటామని టీమిండియా కోచ్ రవిశాస్త్రి.. కెప్టెన్ విరాట్ కోహ్లీ కలిసి ఇంగ్లాండ్ పర్యటనకు ముందు మాటిచ్చారు. అయితే ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా ముగిసిన మూడో టెస్టులో అద్భుతంగా ప్రదర్శించిన టీమిండియా నాలుగో టెస్టులో రాణించలేకపోయింది. ఫలితంగా మ్యాచ్ వైఫల్యంతో పాటుగా సిరీస్ను చేజార్చుకుంది.
దీనిపై ఇప్పటికే పలువురు కామెంట్లు విసురుతుండగా ఇప్పుడు వారితో పాటుగా టీమిండియా సీనియర్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా చేరిపోయాడు. పర్యటనకు ముందు రవిశాస్త్రి చేసిన మాటల గురించి ఇప్పుడేం చెప్తాడని ప్రశ్నిస్తున్నాడు.
'ఎవరు ఎలా ఆడారనే విషయాన్ని ప్రస్తావించను. కానీ, డ్రెస్సింగ్ రూమ్లలో కూర్చొని బాగా ఆడతాం.. సాధించి తీరతాం అంటూ ప్రగల్భాలు పలికితే ఛాంపియన్లు అయిపోరు. చేసేదేమైనా ఉంటే బ్యాట్తోనే చూపించాలి. అలా కాకుండా అత్యుత్తమ పర్యాటక జట్టుగా నిరూపించుకుంటాం అని సమావేశాల్లో చెప్పుకుంటూ పోతే అనిపించుకోలేరు' అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.
నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ జట్టుపై భారత బౌలర్లు చేసిన ప్రదర్శన గురించి మాట్లాడిన కోహ్లీ.. ఈ విధంగా స్పందించాడు. బ్యాట్స్మెన్ విఫలమైయ్యారు కానీ, బౌలర్లు మాత్రం రెచ్చిపోయారు. ప్రత్యర్థి జట్టు 20 వికెట్లు పడగొట్టారు. ఆ క్రమంలోనే 194 పరుగుల లక్ష్యాన్ని చేధించలేకపోయారు. ఇలా నాలుగో టెస్టులో బౌలర్లు సత్తా చాటినా బ్యాట్స్మెన్ తడబాటు తప్పలేదు.