హైదరాబాద్: ఇంగ్లాండ్ క్రికెట్కు మరో చేదు వార్త. కోర్టు విచారణ మేరకు టీమిండియా-ఇంగ్లాండ్ల టెస్టు సిరీస్ నుంచి తాత్కాలిక విరామం తీసుకున్న బెన్ స్టోక్స్కు ప్రతికూల వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో అతనికి శిక్ష భారీగానే పడే అవకాశాలు కనిపిస్తుండటంతో ఇంగ్లాండ్ జట్టు ప్రత్యామ్నాయం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతేడాది సెప్టెంబర్లో ఇద్దరు వ్యక్తులపై దాడి కేసులో కోర్టు విచారణ ఎదుర్కొంటున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ చిక్కుల్లో పడినట్లేనని విమర్శకులు పెదవి విరుస్తున్నారు.
కొద్ది నెలల క్రితం క్లబ్ బయట ఇద్దరు వ్యక్తులపై స్టోక్స్ దాడికి దిగాడనే కేసులో అతనిపై వాదనలు బలంగానే వినిపిస్తున్నాయి. స్టోక్స్ స్వీయ నియంత్రణ కోల్పోయి, విచక్షణ మరచి ఇద్దరు వ్యక్తులను తీవ్రంగా గాయపరిచాడంటూ ప్రాసిక్యూటర్ నికోలస్ కోర్సెల్లిస్ సోమవారం బ్రిస్టోల్ క్రౌన్ కోర్టు జ్యూరీకి తన వాదనను వినిపించారు.
'ఆ సమయంలో స్టోక్స్ విచక్షణారాహిత్యంగా ప్రవర్తించాడు. ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే దాడి చేశాడు. తర్వాత ఆత్మరక్షణ కోసమే కొట్టానని నటించాడు. మొదట హలెను అపస్మారక స్థితికి చేరేలా గాయపర్చిన స్టోక్.. కొంచెం సేపు ఆగి అలీని కూడా అలాగే కొట్టాడు. కన్నుకు గాయమై అలీ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఇది ఓ చిన్న ఘటన కాదు. స్టోక్స్ ఓ ప్రముఖ క్రికెటర్. అలీ అత్యవసరం సేవల విభాగంలో పనిచేశాడు. విజయాలు, పేరు, ప్రఖ్యాతులు సంపాదించినప్పటికీ చట్టాన్ని అతిక్రమించి ప్రవర్తించడం నేరం' అని నికోలస్ కోర్టుకు తెలిపాడు.
అయితే స్టోక్స్ తరపు న్యాయవాది మాత్రం.. అతణ్ని వెనకేసుకొస్తూ.. కేవలం ఆత్మరక్షణ కోసమే కొట్టాడని చెప్పుకొస్తున్నాడు. భారత్తో తొలి టెస్టులో ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించిన స్టోక్స్.. ఈ కేసు విచారణ నేపథ్యంలో స్టోక్స్ రెండో టెస్టుకు దూరమవుతున్నాడు.