ఐపీఎల్ ఆడేందుకు సిద్ధం:
కరోనా కారణంగా భారత్లో ప్రస్తుతం లాక్డౌన్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్ ఆడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఇంగ్లండ్ ఆల్రౌండర్, రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు బెన్ స్టోక్స్ స్పష్టం చేశాడు. ఇటీవల ఓ అంతర్జాతీయ పత్రికతో మాట్లాడిన స్టోక్స్.. ఏప్రిల్ 20న ఐపీఎల్ మొదలైతే అందులో తాను పాల్గొనబోతున్నట్లు చెప్పాడు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను తర్వాత ఆడబోయేది ఐపీఎల్ క్రికెటేనని పేర్కొన్నాడు. ప్రస్తుతానికి ఐపీఎల్ షెడ్యూల్లో మార్పులేనందున ఏప్రిల్ 20న ఆడనున్నట్లు స్టోక్స్ అన్నాడు. ఈ సీజన్ జరగదనే విషయం తనకు తెలిసినా, ఒకవేళ జరిగితే ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పాడు.
సున్నితమైన నిర్ణయం తీసుకోవాలి:
ఐపీఎల్ ఆడాలంటే తమ ఆటగాళ్లకు ఎన్నో జాగ్రత్తలు చెబుతారని, అయినా ఆడేందుకు అవకాశం ఇస్తే సున్నితమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని బెన్ స్టోక్స్ తెలిపాడు. 2018 ఆటగాళ్ల వేలంలో బెన్ స్టోక్స్ని రికార్డు స్థాయిలో రూ. 12.5 కోట్లకి రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. స్టోక్స్ బ్యాట్, బంతితో తన జట్టుకు అద్భుత విజయాలు అందించాడు. ఇక 2019 ప్రపంచకప్లో ఇంగ్లీష్ జట్టును విజేతగా నిలిపిన విషయం తెలిసిందే.
ప్రాంచైజ్, బీసీసీఐ మీటింగ్ రద్దు:
ఐపీఎల్ 2020 సీజన్ వాయిదా తర్వాత టోర్నీ రీషెడ్యూల్పై గత మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫ్రాంఛైజీలతో చర్చించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భావించింది. అయితే సమావేశానికి కొన్ని గంటల ముందు బీసీసీఐ ఆ మీటింగ్ని రద్దు చేసింది. ఇక దేశంలో కరోనా వైరస్ ఏమాత్రం అదుపులోకి రాకపోవడంతో ఇప్పట్లో టోర్నీ జరగడం అనుమనంగానే మారింది. ఇక భారత ప్రభుత్వం కూడా దేశంలో 21 రోజుల పాటు లాక్డౌన్ విధించడంతో.. ఐపీఎల్ నిర్వహణపై బీసీసీఐ ఎటూ తేల్చుకోలేకపోతోంది. పర్యాటక వీసాల్ని భారత ప్రభుత్వం ఏప్రిల్ 15 వరకూ రద్దు చేయడంతో విదేశీ క్రికెటర్లు అప్పటిలోపు భారత్లో అడుగుపెట్టే అవకాశం లేదు.