మెల్బోర్న్: ఆస్ట్రేలియా జట్టు అద్భుత ప్రదర్శన చేసిన కారణంగా టెస్టుల్లో మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకుందని ఆ జట్టు హెడ్కోచ్ జస్టిన్ లాంగర్ శుక్రవారం ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కరోనా కారణంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్రస్తుతం సమయంలో ఈ వార్త తమకు కాస్త సంతోషం కలిగించిందన్నాడు. టీమిండియాను వారి సొంతగడ్డపై ఓడించాలని అత్యున్న లక్ష్యం నిర్దేశించుకున్నామని లాంగర్ తెలిపాడు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ కూడా గెలువడం ముఖ్యమే అని అన్నాడు.
కెప్టెన్, బ్యాట్స్మన్గా స్మిత్ కన్నా కోహ్లీనే బెస్ట్: ఛాపెల్
టెస్టు ర్యాంకింగ్స్లో సుదీర్ఘ కాలం పాటు నంబర్ వన్గా కొనసాగిన టీమిండియా.. ఆ ర్యాంక్ను కోల్పోయింది. టెస్ట్ ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియా (116 రేటింగ్), న్యూజిలాండ్ (115), భారత్ (114) జట్లు వరుసగా మూడు స్థానాల్లో నిలిచాయి. జస్టిన్ లాంగర్ మాట్లాడుతూ... 'ప్రస్తుతం మా లక్ష్యం టెస్టు ప్రపంచ చాంపియన్షిప్. మొత్తంగా మా టార్గెట్ మాత్రం భారత్ గడ్డపై ఆ జట్టును టెస్టు సిరీస్లో ఓడించడమే. ఆ తర్వాత ఆస్ట్రేలియాకు వచ్చినా భారత్పై మళ్లీ మేమే గెలువాలి. అత్యుత్తమ జట్టుపై గెలిచినప్పుడే మమ్మల్ని మేం మరింత బెస్ట్గా ఫీలవుతాం' అని లాంగర్ అన్నాడు.
'టీమిండియాను వారి సొంతగడ్డపై ఓడించడం అంత సులభం కాదన్నాడు. ర్యాంకింగ్స్ ఎప్పుడూ డైనమిక్గా ఉంటాయని, ఎవరైతే ఉత్తమ ఆటతీరు కనబరుస్తారే వాళ్లే మెరుగైన ర్యాంకును దక్కించుకుంటారు. గత రెండేళ్లుగా తాము ఆన్ ద ఫీల్డ్తోపాటు ఆఫ్ ద ఫీల్డ్లోనూ రాణిస్తున్నాం' అని లాంగర్ చెప్పాడు. 2018లో బాల్ టాంపరింగ్ సంఘటన అనంతరం ఆసీస్ ఆటతీరు క్రమంగా గాడిన పడింది. తాజాగా నెం.1 టెస్టు జట్టుగా నిలిచింది. ఈ ఏడాది చివరలో టీమిండియా.. ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. ఈ పర్యటనలో ఇరు జట్లు నాలుగు టెస్టులు ఆడనున్నాయి.
స్వదేశంలో భారత్ చేతిలో టెస్టు సిరీస్ ఓటమి తన కోచింగ్ కెరీర్కు మేలుకొలుపు లాంటిదని జస్టిన్ లాంగర్ ఇటీవల పేర్కొన్నాడు. 2018-19లో జరిగిన నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్ను విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత్ 2-1తో సొంతం చేసుకుంది. ఆసీస్ గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్ గెలిచిన కోహ్లీసేన సరికొత్త చరిత్ర నెలకొల్పింది. అయితే ఆసీస్ స్వదేశంలో సిరీస్ ఓడిపోవడం తనకు ఒక పెద్ద గుణపాఠమని అంటున్నాడు జస్టిన్ లాంగర్.
2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్లో బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకుని ఓపెనర్ డేవిడ్ వార్నర్, అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్లు ఏడాది పాటు నిషేధానికి గురి కాగా.. బాన్క్రాఫ్ట్ కూడా 9 నెలల నిషేధం పడింది. అదే సమయలో జస్టిన్ లాంగర్ కోచింగ్ బాధ్యతలు తీసుకున్నాడు. అప్పటివరకూ డారెన్ లీమన్ కోచ్గా ఉండగా.. ఆ స్థానంలో లాంగర్కు పర్యవేక్షణ బాధ్యతలు అప్పచెప్పారు. అయితే టీమిండియాతో జరిగిన టెస్టు సిరీస్ను ఆసీస్ సొంత గడ్డపై కోల్పోయింది.