సిడ్నీ: ఈ ఏడాది అక్టోబర్-నవంబర్లో ఆస్ట్రేలియాలో జరగాల్సిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ షెడ్యూలు ప్రకారం జరుగుతుందన్న నమ్మకం తనకు లేదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ ఛాపెల్ అన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నిర్వహించాలని కోరుకుంటే మాత్రం మార్గం సుగమం అవుతుందన్నారు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ జరగడం కష్టమేనని ఛాపెల్ అభిప్రాయపడ్డారు.
ఆమెతో జత కట్టొచ్చుకదా కోహ్లీ.. అనుష్క హెల్ప్ చేస్తుందిలే: వార్నర్
షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 29న ఐపీఎల్ సీజన్ ప్రారంభం కావాలి. కరోనా వైరస్ ముప్పుతో దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేయడంతో లీగ్ను నిరవధికంగా వాయిదా వేశారు. లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా.. అభిమానులను అనుమతించకుండా క్రీడలు నిర్వహించుకోవచ్చని ఈ మధ్యే కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. దీంతో టోర్నీ నిర్వహణపై మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే టీ20 ప్రపంచకప్ వాయిదా పడితేనే ఐపీఎల్ సాధ్యమవుతుంది.
తాజాగా 'వైడ్ వరల్డ్ ఆఫ్ స్పోర్ట్స్'తో ఇయాన్ ఛాపెల్ మాట్లాడుతూ... 'ముందుగా మనందరం తెలుసుకోవాల్సింది ఏమిటంటే.. బీసీసీఐ కచ్చితంగా గెలుస్తుంది. అక్టోబర్లో ఐపీఎల్ నిర్వహించాలనుకుంటే వారికి మార్గం సుగమం అవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో టీ20 ప్రపంచకప్ జరగకపోవచ్చు' అని ఛాపెల్ అన్నారు. ఆసీస్ మరో మాజీ సారథి మార్క్ టేలర్ సైతం టీ20 ప్రపంచకప్ భవిష్యత్తుపై తన అభిప్రాయాన్ని తెలిపాడు. ఐపీఎల్కు జరిగేందుకే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు.
'టీ20 ప్రపంచకప్ స్థానంలో ఐపీఎల్-13 జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అక్టోబర్-నవంబర్లో 16 జట్లు ఆస్ట్రేలియాకు వెళ్లి ఏడు వేదికల్లో 45 మ్యాచుల్లో తలపడటం అత్యంత కష్టం. వసతి, ప్రయాణం లాంటివి ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. ఒకవేళ ప్రపంచకప్ను ఐసీసీ వాయిదా వేస్తే.. బీసీసీఐకి ఐపీఎల్ నిర్వహించేందుకు ద్వారాలు తెరిచినట్టే. అప్పుడు భారం దేశాలపై కాకుండా వ్యక్తులపై పడుతుంది' అని టేలర్ పేరొన్నారు.
ఈ ఏడాది అక్టోబర్-నవంబర్లో ఆస్ట్రేలియాలో జరగాల్సిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ వాయిదా పడనుందని సమాచారం. వచ్చే వారం ఈ విషయాన్ని ఐసీసీ అధికారికంగా ప్రకటించనుందని తెలుస్తోంది. దీంతో అక్టోబర్-నవంబర్లో ఐపీఎల్ నిర్వహించే అవకాశాలున్నాయని ఇటీవల వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై బోర్డర్ స్పందించారు. 'ప్రపంచకప్ నిర్వహించాల్సిన వేళ ఐపీఎల్ కొనసాగిస్తే ఒప్పుకోను. స్థానిక లీగ్ కన్నా ప్రపంచకప్కే ప్రాధాన్యత ఇవ్వాలి. ఒకవేళ అలా జరగకపోతే ఐపీఎల్ కూడా జరగొద్దు. అక్టోబర్-నవంబర్ సీజన్లో ఐపీఎల్ ఆడించాలనే నిర్ణయం తీసుకుంటే నేను ప్రశ్నిస్తా. డబ్బు కోసమే ఐపీఎల్ నిర్వహిస్తున్నారు. అది నిజం కాదా?. ఒకవేళ టీ20 ప్రపంచకప్కు బదులు ఐపీఎల్ నిర్వహించాలని చూస్తే.. ఇతర బోర్డులు తమ ఆటగాళ్లను అనుమతించొద్దు' అని బోర్డర్ అన్నారు.