యూఏఈలోనే ఐపీఎల్
'ఐపీఎల్ 13 సీజన్ నిర్వహణకు ఈసీబీకి అనుమతిస్తూ బీసీసీఐ అంగీకార లేఖను పంపించింది. ఇకపై లీగ్ నిర్వహణ దిశగా రెండు బోర్డులు కలిసి పనిచేయనున్నాయి. లీగ్ కోసం సిద్ధం కావడానికి జట్లకు కనీసం మూడు నుంచి నాలుగు వారాల సమయం అవసరం. వాటి శిక్షణ శిబిరాలను బయో సెక్యూర్ బబుల్ విధానంలో యూఏఈలోనే నిర్వహించనున్నారు' అని బ్రిజేష్ పటేల్ చెప్పారు. యూఏఈలో జరిగే టోర్నీలో మొత్తం ఎనిమిది ఐపీఎల్ ఫ్రాంచైజీలు పాల్గొంటాయని పటేల్ క్లారిటీ ఇచ్చారు.
అధికారిక లేఖ అందింది
తమకు బీసీసీఐ నుంచి మెయిల్ ద్వారా ఒక లేఖ వచ్చిందని ఈసీబీ పేర్కొంది. 'బీసీసీఐ నుంచి అధికారిక లేఖ అందింది. కానీ భారత ప్రభుత్వం నిర్ణయం కోసం నిరీక్షిస్తున్నాం. తుది నిర్ణయం అనేది భారత ప్రభుత్వం ఇచ్చే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది' అని ఈసీబీ సెక్రటరీ ముబాషిర్ ఉస్మానీ తెలిపారు. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 వరకూ ఐపీఎల్ జరిగేలా ఇప్పటికే ప్రాథమికంగా షెడ్యూల్ని తయారు చేసిన బీసీసీఐ.. ఫ్రాంఛైజీలకి కూడా ఈ మేరకు సమాచారమిచ్చి నెల రోజుల ముందుగానే యూఏఈకి జట్లని తరలించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
రెండు నెలల క్రితమే ప్రతిపాదన
ఐపీఎల్ 2020 సీజన్కి తాము ఆతిథ్యమిస్తామని రెండు నెలల క్రితమే ఈసీబీ ఓ ప్రతిపాదనని బీసీసీఐకి పంపింది. కానీ సెప్టెంబరు నాటికి భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతుందని ఆశించిన బీసీసీఐ.. ఆ సమయంలో మౌనంగా ఉండిపోయింది. అయితే దేశంలో ఇప్పటికీ పరిస్థితుల్లో అదుపులోకి రాకపోగా.. మరింతగా చేయి దాటిపోయాయి. దాంతో భారత్లో ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్లు నిర్వహించడం అసాధ్యమని భావించిన బీసీసీఐ.. తాజాగా ఈసీబీ ప్రతిపాదనకి ఆమోదం తెలిపింది. ఈ మేరకు బీసీసీఐ ఓ లేఖని కూడా ఈసీబీకి పంపింది. ఇక ఇప్పుడు భారత ప్రభుత్వం అనుమతి మాత్రమే ఐపీఎల్ నిర్వహణకు అడ్డంకిగా మారింది.
రెండు సందర్భాల్లో మాత్రమే
2008 నుంచి ఐపీఎల్ జరుగుతుండగా.. ఇప్పటి వరకూ 12 సీజన్లు ముగిశాయి. కానీ కేవలం రెండు సందర్భాల్లో మాత్రమే బీసీసీఐ భారత్ వెలుపల ఐపీఎల్ మ్యాచ్ల్ని నిర్వహించింది. సార్వత్రిక ఎన్నికల కారణంగా 2009లో దక్షిణాఫ్రికా గడ్డపై ఐపీఎల్ మ్యాచ్లు జరిగాయి. ఆ తర్వాత 2014 ఎన్నికల సమయంలోనూ కొన్ని మ్యాచ్లకి యూఏఈ ఆతిథ్యమిచ్చింది. ఆ అనుభవంతోనే ఈసీబీకి మరో అవకాశం బీసీసీఐ ఇచ్చింది. ఒకవేళ ఐపీఎల్ నిర్వహించకపోతే వేల కోట్ల నష్టాన్ని చవిచూడాల్సి రావడంతో ఈ లీగ్ను ఎలాగైనా జరపాలని బీసీసీఐ పట్టుదలగా ఉంది.
'టీమిండియాలో సురేష్ రైనా పునరాగమనం కష్టమే.. ఇక ఆశలు వదులుకోవాల్సిందే'