ముంబై: కరోనా కారణంగా వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్లో మిగిలిన మ్యాచ్లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ అధ్యక్షతన శనివారం జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం) అనంతరం బోర్డు తమ నిర్ణయాన్ని ప్రకటించింది.
అయితే ఏ తేదీల్లో నిర్వహిస్తామనే విషయంపై పూర్తి స్పష్టత రాలేదు. సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 12 మధ్య లీగ్ జరగవచ్చని బోర్డు వర్గాల సమాచారం. 2021 ఐపీఎల్లో 29 మ్యాచ్లు నిర్వహించిన అనంతరం అనూహ్యంగా ఆటగాళ్లకు కరోనా సోకడంతో తప్పనిసరి పరిస్థితుల్లో లీగ్ను వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ప్లే ఆఫ్స్ సహా లీగ్లో మరో 31 మ్యాచ్లు జరగాల్సి ఉంది.
అయితే లీగ్ను యూఏఈకి తరలించడానికి కరోనా వైరస్ కారణం కాదని బీసీసీఐ సెక్రటరీ జై షా స్పష్టం చేశారు. సెప్టెంబర్-అక్టోబర్ మధ్యలో భారత్లో వర్షాలు పడే అవకాశం ఉందని, వాతవరణ సమ్యసల వల్లే దుబాయ్కు తరలించినట్లు వెల్లడించాడు. 'సెప్టెంబరులో భారీగా వర్షాలు పడే అవకాశమున్నందున ఐపీఎల్ను ఇక్కడ నిర్వహించడం కష్టంగా ఉంటుంది. అందుకే యూఏఈలో జరపాలని నిర్ణయించాం" అని జై షా పేర్కొన్నారు.
2020లో మొత్తం టోర్నీకి ఆతిథ్యమిచ్చిన దుబాయ్, అబుదాబి, షార్జా మైదానాల్లోనే ఈ మ్యాచ్లు జరగనున్నాయి. మరోవైపు తాజా షెడ్యూల్ ప్రకారం చూస్తే తమ ఆటగాళ్లు ఐపీఎల్లో ఆడరని ఇంగ్లండ్ బోర్డు ఇప్పటికే ప్రకటించగా... కీలకమైన ఆస్ట్రేలియా బోర్డు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎస్జీఎంలో విదేశీ ఆటగాళ్ల విషయంపై కూడా చర్చ జరిగింది. అయితే ఎవరు వచ్చినా రాకున్నా, ఏ బోర్డునూ బతిమాలబోమని, మిగిలిన మ్యాచ్లను పూర్తి చేయడమే లక్ష్యమని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. అయితే విండీస్ ఆటగాళ్ల కోసం కరీబియన్ ప్రీమియర్ లీగ్ షెడ్యూల్లో మార్పులు చేయాలని బోర్డు కోరినట్లు అంతర్గత సమాచారం. ఆటగాళ్లు ఎవరైనా అందుబాటులో లేకపోతే వారి స్థానాల్లో మరొకరిని తీసుకునేందుకు ఫ్రాంచైజీలను బోర్డు అనుమతిస్తుంది.
సుదీర్ఘ వివాదం అనంతరం బీసీసీఐ వర్చువల్ సమావేశంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) తరఫున అధ్యక్షుడు మొహమ్మద్ అజహరుద్దీన్ హాజరయ్యాడు. అజహర్ వైరి వర్గం కొన్నాళ్ల క్రితం హెచ్సీఏ ప్రతినిధిగా శివలాల్ యాదవ్ పేరును ప్రతిపాదించి పంపించినా... బోర్డు దానిని పట్టించుకోకుండా అజహర్కే అవకాశం కల్పించింది.