హైదరాబాద్: బీసీసీఐకి సుప్రీం కోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. బోర్డు చీఫ్ ఫైనాన్షియల్ అధికారి (సీఎఫ్ఓ) సంతోష్ రంగ్నేకర్ను కోశాధికారి అనిరుధ్ చౌదరి బెదిరించాడన్న ఆరోపణలపై అత్యున్నత ధర్మాసనం మండిపడింది. ఈ ఆరోపణలపై రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, ఖన్విల్కర్, చంద్రచూడ్లతో కూడిన బెంచ్ బుధవారం ఆదేశించింది.
అనుకూలంగా నిబంధనలు: బీసీసీఐకి రూ.52.24 కోట్ల జరిమానా
అనిరుధ్ బెదిరింపులకు సంబంధించి సీఎఫ్వో, సీవోఏ చీఫ్ వినోద్ రాయ్ మధ్య జరిగిన ఈ మొయిల్ సంభాషణలను అమికస్ క్యూరి గోపాల్ సుబ్రమణ్యమ్ సుప్రీం కోర్టు ముందుంచారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. మూడుసార్లు సంతోష్ను బెదిరించడానికి కారణాలేంటో తెలుపాలని ఆదేశించింది.
అయితే అనిరుధ్ చౌదరి ఎలాంటి బెదిరింపులకు పాల్పడలేదని అతని తరఫు న్యాయవాది పునీత్ బాలీ వాదించారు. దీనిపై కచ్చితమైన వాదనలు వింటామని ఈ కేసును వచ్చే ఏడాది జనవరి రెండో వారానికి వాయిదా వేసింది. దీంతో పాటు జస్టిస్ లోధా సిఫారసులకు అనుగుణంగా సీఓఏ రూపొందించిన కొత్త రాజ్యాంగ ముసాయిదాపై సలహాలు, సూచనలతో కూడిన నివేదికను జనవరి 15లోపు అందజేయాలని సుప్రీం అదేశించింది.
అయితే తనపై వచ్చిన ఆరోపణలపై అనిరుధ్ చౌదరి స్పందించారు. తాను ఎవర్ని బెదిరించలేదని, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి తలెత్తిన భేదాభిప్రాయాల వల్లే అలా వ్యవహరించి ఉండొచ్చని అన్నారు. మరోవైపు ప్రసార హక్కుల కేటాయింపులో పోటీ మార్కెట్ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరించారని కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) బీసీసీఐకి రూ. 52 కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే.