హైదరాబాద్: వరల్డ్కప్లో భారత్-పాక్ మ్యాచ్ జరుగుతుందా? లేదా అన్నది ప్రస్తుతం క్రికెట్ అభిమానుల మదిని తొలుస్తోన్న ప్రశ్న. ఈ విషయంపై శుక్రవారం సమావేశమైన బీసీసీఐ పాలకుల కమిటీ రద్దు అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఛైర్మన్ వినోద్ రాయ్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నడుచుకుంటామని పేర్కొంది.
వరల్డ్కప్లో ఆడకుండా పాక్కు రెండు పాయింట్లు: అసహ్యించుకుంటానన్న సచిన్
ఉగ్రవాదానికి ఆశ్రయమిస్తున్న దేశాలతో మిగతా క్రికెట్ దేశాలు సంబంధాలు తెంచుకోవాలని వ్యక్తిగతంగా ఐసీసీని కోరతామని ఈ మేరకు బీసీసీఐ లేఖ రాసింది. ఈ లేఖ పూర్తి సారాంశం మీకోసం...
డియర్ సార్స్,
పాకిస్థాన్ ఆశ్రయమిస్తున్న ఉగ్రవాదులు పుల్వామాలో భారీ ఉగ్రదాడికి తెగబడ్డారు. ఈ ఘోర ఘటనలో భారతకు చెందిన సీఆర్ఫీఎఫ్ జవాన్లు 44 మంది అమరులయ్యారు. భారత గడ్డపై జరిగిన ఈ దాడిని అనేక మంది ఖండిస్తున్నారు. దాడిని దృష్టిలో పెట్టుకొని మా అభ్యంతరాలు, సెంటిమెంటును ఈ లేఖ ద్వారా తెలియజేస్తున్నాం.
ఉగ్రదాడి నేపథ్యంలో త్వరలో జరిగే వరల్డ్కప్లో పాల్గొనే ఆటగాళ్లు, అధికారుల భ్రదత, క్షేమం గురించి బీసీసీఐ ఆందోళన పడుతోంది. భారత్లో జరిగిన ఉగ్రదాడిని ఐసీసీలోని చాలా సభ్యదేశాలు (బ్రిటన్ సహా) గట్టిగా ఖండించాయి. అందుకే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలతో సంబంధాలు తెంచుకోవాలని క్రికెట్ ప్రపంచాన్ని బీసీసీఐ కోరుతోంది.
ఐసీసీ వరల్డ్కప్ను వీక్షించేందుకు వచ్చే భారత అభిమానుల భద్రత, క్షేమం గురించీ బీసీసీఐ భయపడుతోంది. మైదానాల్లో ఆటగాళ్లు, మ్యాచ్ అధికారులు, అభిమానులకు ఐసీసీ, ఈసీబీ పటిష్ట భద్రత కల్పిస్తాయని బీసీసీఐ విశ్వసిస్తోంది. ఈ విషయంలో బీసీసీఐకి అన్ని హక్కులు ఉన్నాయి. గౌరవనీయ సుప్రీం కోర్టు నియమించిన క్రికెట్ పాలకుల కమిటీ తరఫున బీసీసీఐ ఈ లేఖను పంపిస్తోంది.
ఇట్లు
రాహుల్ జోహ్రీ.