
హైదరాబాద్: ఇక నుంచి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)ని సైతం సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకొచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు లా కమిషన్ ప్రతిపాదనలను సిద్ధం చేసుకుంది. బీసీసీ చేస్తున్న ప్రతి పని ప్రజలతో సంబంధం కలిగి ఉన్నాయి కాబట్టి కచ్చితంగా ఆర్టీఐ పరిధిలోకి రావాల్సిందేనని కమిషన్ స్పష్టం చేసింది.
తమిళనాడుకు చెందిన ఓ ప్రైవేట్ సంస్థ సొసైటీస్ యాక్ట్ పరిధిలో బీసీసీఐ నమోదై ఉంది. అదేగాక, ఇన్నాళ్లూ తాము ప్రభుత్వాల నుంచి ఎలాంటి నిధులు తీసుకోవడం లేదని, ఫలితంగా ఆర్టీఐ తమకు వర్తించదన్నట్లుగా బోర్డు వాదన ఉంది.
దీంతో ఈ అంశంపై తేల్చాలని 2016లో సుప్రీంకోర్టు లా కమిషన్కు సూచించింది. అన్ని అంశాలను కూలంకషంగా పరిశీలించిన తమ ప్యానెల్ పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేసిందని, దానిని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్కు అందజేస్తామని లా కమిషన్ చైర్మన్ బీఎస్ చౌహాన్ తెలిపారు.
గత కొన్నేండ్లుగా ప్రభుత్వాల నుంచి పన్ను మినహాయింపులను, స్టేడియాల కోసం భూమిని తీసుకోవడం బీసీసీఐ చేస్తున్నది. కాబట్టి దీనిని పబ్లిక్ బాడీగానే గుర్తిస్తూ ఆర్టీఐ పరిధిలోకి తీసుకురావాల్సిందే అని చౌహాన్ పేర్కొన్నారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.