న్యూఢిల్లీ: కరోనా కారణంగా గతేడాది ఐపీఎల్ యూఏఈకి తరలిపోయింది. ఇక వచ్చే నెలలో ఇంగ్లండ్తో జరిగే తొలి రెండు టెస్టులకు కూడా ప్రేక్షకులకు అనుమతి లేదు. ఈ నేపథ్యంలో కనీసం ఐదు టీ20ల సిరీస్కైనా స్టేడియాల్లోకి ఫ్యాన్స్ను అనుమతించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భావిస్తోందట. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని బోర్డు నిర్ణయించింది. అదే జరిగితే నిజంగా అభిమానుల సంతోషానికి అవధులుండవు. ఎందుకంటే.. దాదాపు ఏడాది కాలంగా భారత క్రికెటర్ల ప్రదర్శనను ప్రత్యక్షంగా తిలకించలేకపోయారు. మార్చి 12 నుంచి అహ్మదాబాద్లోని మొతేరా స్టేడియంలో టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. లక్షకు పైగా సీటింగ్ సామర్థ్యం కలిగి ప్రపంచంలోనే నెంబర్వన్ క్రికెట్ స్టేడియంగా మొతేరా మైదానం గుర్తింపు పొందింది.
'భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఉత్కంఠభరితంగా సాగే టీ20 మ్యాచ్లను ప్రత్యక్షంగా చూసేందుకు వీలు కల్పించాలనుకుంటున్నాం. అయితే ఎంత మందిని అనుమతించాలనే దానిపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. 50 శాతం సీట్లను ప్రేక్షకులతో నింపాలనే ఆలోచన ఉంది. ప్రభుత్వ ఆమోదం తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటాం. ఇక్కడ అందరి ఆరోగ్యం, భద్రతే ప్రధానమైంది. సురక్షితంగా నిర్వహించడమే ముఖ్యం'అని బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. కోవిడ్-19 నేపథ్యంలో ఆటగాళ్లకు హాని చేసే ఏ రిస్క్ తీసుకోకూడదని బోర్డు భావిస్తోందని, క్రికెటర్లు క్వారంటైన్, కరోనా పరీక్షలు నిర్వహించాకే బయో బబుల్లోకి వెళ్తారని అక్కడ్నించి ఆంక్షలు మొదలవుతాయని చెప్పారు.
నాలుగు మ్యాచ్ల సిరీస్లో తొలి రెండు టెస్టులు (ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు; ఫిబ్రవరి 13 నుంచి 17 వరకు) చెన్నైలోనే జరుగుతాయి. అనంతరం మూడో టెస్టు ఫిబ్రవరి 24 నుంచి 28 వరకు... నాలుగో టెస్టు మార్చి 4 నుంచి 8 వరకు అహ్మదాబాద్లో నిర్వహిస్తారు. అహ్మదాబాద్లోనే మార్చి 12 నుంచి ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ మొదలవుతుంది. అక్కడి సర్దార్ పటేల్ మొతెరా స్టేడియాన్ని పూర్తిగా పునర్నిర్మించారు. దీంతో లక్షా 10 వేల మంది ప్రేక్షకులు మ్యాచ్ను తిలకించవచ్చు. కనీసం 50 శాతం అనుమతించినా 55 వేల మందికి ప్రత్యక్షంగా చూసే భాగ్యం కలుగుతుంది.
ఇంగ్లండ్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ ముందుగానే భారత్ వచ్చేశాడు. ఆదివారం ఢిల్లీ చేరుకున్నాడు. ఈ సందర్భంగా విమానంలో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్న స్టోక్స్.. త్వరలోనే కలుద్దాం అంటూ ట్వీట్ చేశాడు. కరోనా పరీక్షలనంతరం స్టోక్స్ చెన్నైలో ఏర్పాటు చేసిన బయో బబుల్లోకి ప్రవేశిస్తాడు.