హైదరాబాద్: వీలైనంత త్వరగా బీసీసీఐకి అంబుడ్స్మన్, ఎథిక్స్ అధికారిని నియమించాలని పరిపాలన కమిటీ (సీవోఏ) కోరుకుంటుంది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు సమర్పించిన 10వ స్థాయి సంఘం నివేదికలో ఈ అంశాన్ని పొందుపర్చింది. అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బీసీసీఐ సర్వసభ్య సమావేశం, ఎన్నికలలోపే ఇది జరిగితే బాగుంటుందని పేర్కొంది.
దాంతో పాటుగా ఎన్నిక సమయంలో తలెత్తే వివాదాలను స్వతంత్రంగా దర్యాప్తు చేసుకునే వీలుంటుందని ఆకాంక్షను బయటపెట్టింది. ఇందుకు ఆ ఇద్దరి అవసరం చాలా ఉంటుందంటూ పునురుద్ఘాటించింది. కొత్తగా రూపొందించిన రాజ్యాంగం ప్రకారం బీసీసీఐకి అంబుడ్స్మన్, ఎథిక్స్ అధికారి ఉండాలి. ఈ ఇద్దరి వల్ల స్వతంత్రంగా వివాదాలను పరిష్కరించే ఓ మెకానిజమ్ అందుబాటులోకి వస్తుంది.
కాబట్టి అంబుడ్స్మన్గా రిటైర్డ్ జడ్జి లేదా హైకోర్టు చీఫ్ జస్టిస్ను నియమించాలి. ఏడాది నుంచి మూడేళ్ల పదవీకాలం. బీసీసీఐ ఏజీఎమ్ను ఎప్పుడు నిర్వహిస్తుందో ఇంకా తెలియదు. కొన్ని సంఘాలు ఇంకా ఆఫీస్ బేరర్ల పదవీకాలం, వయసుపై సమస్యలను సృష్టిస్తున్నాయి. వీటి పరిష్కరానికి అంబుడ్స్మన్ కావాలి.
ఈ నియామకం పూర్తయితే సభ్యులు లేవనెత్తే అంశాలపై కూలంకషంగా చర్చలు జరపొచ్చు అని సీవోఏ వ్యాఖ్యానించింది. క్రమశిక్షణరాహిత్యం, దుష్ప్రవర్తన, నిబంధనలను ఉల్లంఘించడం, పరస్పర విరుద్ధ ప్రయోజనాల వంటి అంశాలపై చర్యలు తీసుకోవాంటే ఎథిక్స్ అధికారి ఉండటం చాలా కీలకమని వెల్లడించింది. కొత్త రాజ్యాంగాన్ని అమలు చేయడంలో ఏడు రాష్ట్ర సంఘాలు విఫలమయ్యాయని రాయ్ బృందం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చింది.