ముంబై: ఐదేళ్ల క్రితం ఇంటర్-ఫ్రాంచైజ్ టోర్నమెంట్ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ఛాంపియన్స్ లీగ్ (సీఎల్ టీ20) విండోను తిరిగి ఎలా ఉపయోగించుకోవాలని బీసీసీఐ ఆలోచనలు చేస్తోంది. ఓ మినీ ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్)ను బీసీసీఐ కోరుకుంటున్నట్లు సమాచారం తెలుస్తోంది. దీంతో ఐపీఎల్ జట్లు తమకు కేటాయించిన రెండు నెలల కన్నా ఎక్కువ సమయం వెచ్చించాల్సి ఉంటుంది.
వైజాగ్ చేరుకున్న భారత్, వెస్టిండీస్ ఆటగాళ్లు!!
నవంబర్ 5న బీసీసీఐ, ఐపీఎల్ పాలక మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం తెలుస్తోంది. ఐపీఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ హేమాంగ్ అమిన్ మాట్లాడుతూ... 'ఛాంపియన్స్ లీగ్ 15-20 రోజుల పాటు సెప్టెంబర్/అక్టోబర్ నెలలలో ఉండేది. అయితే ఐదేళ్లక్రితం సీఎల్ టీ20 నిలిపివేయబడింది. చివరిసారి 2014లో జరిగింది. ఆసియాకప్ సాధారణంగా జూన్ నెలలో ఉంటుంది. సీఎల్ టీ20 నిలిపివేయబడిన తరువాత సెప్టెంబర్/అక్టోబర్ నెలలో నిర్వహిస్తున్నారు' అని అన్నారు.
'టీ20 ప్రపంచకప్ను కూడా షెడ్యూల్ చేశారు. సెప్టెంబర్/అక్టోబర్ సీఎల్ టీ20 విండో అయినందున బీసీసీఐ దీనిని 2వ ఐపీఎల్ విండోగా ఉపయోగించుకోవాలని చూస్తోంది. దీంతో ప్రస్తుత జట్లు రెండు నెలల కంటే ఎక్కువ సమయం వెచ్చించాల్సి ఉంటుంది. బీసీసీఐకి ఆదాయం కూడా రానుంది. ఇది క్రికెట్ ఆటకు శుభసూచికం. చర్చలు జరుగుతున్నాయి. తుది నిర్ణయం తీసుకున్నాక అన్ని వివరాలు తెలియజేస్తాం' అని హేమాంగ్ అమిన్ తెలిపాడు.
ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే కోల్కతా వేదికగా ఐపీఎల్ వేలం జరుగుతుందని నిర్వాహకులు ఓ పరకటనలో తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)తో ఈశాన్య రాష్ట్రాలలో సహా పశ్చిమబెంగాల్, ఢిల్లీ ఆందోళనలతో అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. సీఏఏను రద్దు చేయాలని కోరుతూ వందలాది మంది విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ నిర్వాహకులు మీడియాతో మాట్లాడి షెడ్యూల్ ప్రకారమే ఐపీఎల్ వేలం ఉంటుందని పేర్కొన్నారు.