కోల్కత్తా: కోల్కత్తాలో శుక్రవారం జరిగిన బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశం వాయిదా పడింది. బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మాజీ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ తమిళనాడు క్రికెట్ సంఘం చీఫ్ హోదాలో హాజరయ్యారు.
శ్రీనివాసన్ రాకతో బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశంలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు శ్రీనివాసన్కు ఏం అర్హత ఉందంటూ కొందరు సభ్యులు ప్రశ్నించారు. దీంతో బీసీసీఐ సమావేశాలకు తాను హాజరు కావొచ్చని జస్టిస్ శ్రీకృష్ణ పేర్కొన్నారని శ్రీని వాదించారు.
ఈ సమావేశం సందర్భంగా పలువురు సభ్యులు, బీసీసీఐ సమావేశాలకు దూరంగా ఉండాలంటూ శ్రీనికి సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో శ్రీనివాసన్ హోదా విషయంలో న్యాయపరమైన స్పష్టత వచ్చేవరకు ఆయనను అనుమతించలేమని బీసీసీఐ లీగల్ అడ్వైజర్ ఉషానాథ్ బెనర్జీ అభిప్రాయపడ్డారు.
శుక్రవారం జరగాల్సిన ఈ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా ప్రకటించారు. ఈ సమావేశంలో బీసీసీఐ పలు కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాజస్థాన్, చెన్నై జట్ల నిషేధంపై కమిటీ ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.